
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిన 46 ఏళ్ల నాటి హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే విజయ్ మిశ్రాను కోర్టు దోషిగా తేల్చింది. 1980లో కోర్టు ప్రాంగణంలో జరిగిన హత్య కేసులో విజయ్ మిశ్రాతో పాటు మరో ముగ్గురు నిందితులను కూడా ఎంపీ-ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన ఈ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటన 1980 ఫిబ్రవరి 11న చోటుచేసుకుంది. ఆ రోజు కోర్టు ప్రాంగణంలో ఉన్న ప్రకాష్ నారాయణ్ పాండేను దుండగులు తుపాకులతో కాల్చిచంపారు. నడిరోడ్డుపై జరిగిన ఈ కాల్పుల ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. కాల్పుల్లో మరో ఐదుగురు కూడా బుల్లెట్ గాయాలతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతుడు ప్రకాష్ నారాయణ్ పాండే సోదరుడు శ్యామ్ నారాయణ్ పాండే ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో మాజీ ఎమ్మెల్యే విజయ్ మిశ్రాతో పాటు బలరామ్, సంత్రాం, జీత్ నారాయణ్ పేర్లు వెలుగులోకి వచ్చాయి. అనంతరం వీరిపై హత్య, కుట్ర, ఆయుధాల వినియోగం వంటి పలు అభియోగాలు నమోదు చేశారు.
అయితే ఈ కేసు విచారణలో అనేక మలుపులు చోటుచేసుకున్నాయి. హై-ప్రొఫైల్ కేసు కావడంతో కేసుకు సంబంధించిన కీలక ఫైళ్లు మాయం కావడం అప్పట్లో పెద్ద వివాదానికి దారి తీసింది. సాక్ష్యాధారాలు లేకుండా కేసు బలహీనపడుతుందని భావించినప్పటికీ, ప్రాసిక్యూషన్ మాత్రం పట్టుదలతో విచారణ కొనసాగించింది. పాత రికార్డులు, సాక్షుల వాంగ్మూలాలు, అందుబాటులో ఉన్న ఆధారాలను సమీకరించి నేరాన్ని కోర్టు ముందు నిరూపించింది.
దాదాపు 46 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం ఎంపీ-ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించింది. విజయ్ మిశ్రాతో పాటు మిగతా ముగ్గురు నిందితులను కోర్టు దోషులుగా తేల్చింది. ఈ కేసులో శిక్షపై త్వరలోనే కోర్టు తుది నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది.
ఈ తీర్పు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి నేర రాజకీయాలపై చర్చకు దారి తీసింది. దశాబ్దాల క్రితం జరిగిన నేరాల్లో కూడా చివరకు న్యాయం జరుగుతుందనే సందేశాన్ని ఈ తీర్పు ఇచ్చిందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, ఇంతకాలం పాటు కేసు సాగడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 46 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ తీర్పు బాధిత కుటుంబానికి కొంత న్యాయం చేసినట్టేనని స్థానికులు భావిస్తున్నారు. రాజకీయ ప్రభావాలు, కేసు ఫైళ్లు మాయం అయినా… చివరకు నిందితులు శిక్ష నుంచి తప్పించుకోలేదనే అంశం ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..