
నియోజకవర్గాల పునర్విభజన అంశం భారత రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. రేపు అంటే గురువారం, ఏప్రిల్ 16 నుండి ప్రారంభం కానున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రభుత్వం దీనికి సంబంధించిన కీలక బిల్లులను ప్రవేశపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ బిల్లుల సారాంశం ఏమిటి? దక్షిణాది రాష్ట్రాలు వీటిని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ప్రభుత్వం చెబుతున్న వాదనలేంటి? అనే అంశాలపై ఒక సమగ్ర విశ్లేషణ ఒక్కసారి పరిశీలిద్దాం..
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు చారిత్రక మార్పు దిశగా అడుగులు వేస్తోంది. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే విధంగా ప్రభుత్వం మూడు ప్రధాన బిల్లులను సభ ముందుకు తీసుకువస్తోంది.
ఈ ప్రతిపాదనలపై తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. జనాభాను నియంత్రించి, అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తమకు, ఈ జనాభా ఆధారిత సీట్ల పెంపు అన్యాయం చేస్తుందని అవి భావిస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ దీనిని రాష్ట్ర ప్రయోజనాలపై దాడి అని అభివర్ణించగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇది దేశ సమాఖ్య వ్యవస్థ సమతుల్యతను దెబ్బతీస్తుందని దేశ ప్రధానికి లేఖ రాశారు. జనాభా నియంత్రణ పాటించని ఉత్తరాది రాష్ట్రాలకు సీట్లు పెరగడం వల్ల, భవిష్యత్తులో దేశ రాజకీయ నిర్ణయాధికారంలో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కబడుతుందనేది ప్రధాన ఆందోళన. మాజీ కేంద్ర మంత్రి చిదంబరం గణాంకాలతో వివరిస్తూ, ప్రస్తుత నియోజకవర్గాల మార్పు వల్ల దక్షిణాది రాష్ట్రాల వాటా 24.3% నుండి 20.7%కి పడిపోతుందని హెచ్చరించారు. ఇది ఒక దురుద్దేశపూరిత కుట్ర అని ఆయన విమర్శించారు.
తమిళనాడు ప్రస్తుతం 39 లోక్సభ స్థానాలను కలిగి ఉంది. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన కేవలం 2011 జనాభా లెక్కల ఆధారంగానే జరిగి ఉంటే, దానికి 49 స్థానాలు లభించి ఉండేవి. కానీ, అన్ని రాష్ట్రాల వాటాలను దామాషా పద్ధతిలో 50% మేర పెంచాలన్న భారత ప్రభుత్వ సూత్రం ప్రకారం, ఇప్పుడు దానికి 59 స్థానాలు లభిస్తాయి.
కేరళలో ప్రస్తుతం 20 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన కేవలం 2011 జనాభా లెక్కల ఆధారంగానే జరిగి ఉంటే, దానికి 23 స్థానాలు లభించి ఉండేవి. కానీ, అన్ని రాష్ట్రాల వాటాలను దామాషా పద్ధతిలో 50% మేర పెంచాలన్న భారత ప్రభుత్వ సూత్రం ప్రకారం, ఇప్పుడు దానికి 30 స్థానాలు లభిస్తాయి.
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ప్రస్తుతం రాష్ట్రంలో 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన కేవలం 2011 జనాభా లెక్కల ఆధారంగానే జరిగి ఉంటే, దానికి 33 స్థానాలు లభించి ఉండేవి. కానీ, అన్ని రాష్ట్రాల వాటాలను దామాషా పద్ధతిలో 50% మేర పెంచాలన్న భారత ప్రభుత్వ సూత్రం ప్రకారం, ఇప్పుడు దానికి 37 స్థానాలు లభిస్తాయి.
తెలంగాణ ప్రస్తుతం 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన కేవలం 2011 జనాభా లెక్కల ఆధారంగానే జరిగి ఉంటే, దానికి 24 స్థానాలు లభించి ఉండేవి. కానీ, అన్ని రాష్ట్రాల వాటాలను దామాషా పద్ధతిలో 50% మేర పెంచాలన్న భారత ప్రభుత్వ సూత్రం ప్రకారం, ఇప్పుడు దానికి 25 స్థానాలు లభిస్తాయి.
ఒడిశా ప్రస్తుతం 21 స్థానాలను కలిగి ఉంది. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన కేవలం 2011 జనాభా లెక్కల ఆధారంగానే జరిగి ఉంటే, దానికి 28 స్థానాలు లభించి ఉండేవి. కానీ, అన్ని రాష్ట్రాల వాటాలను దామాషా పద్ధతిలో 50% మేర పెంచాలన్న భారత ప్రభుత్వ సూత్రం ప్రకారం, ఇప్పుడు దానికి 31 స్థానాలు లభిస్తాయి.
కర్ణాటకలో ప్రస్తుతం 28 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన కేవలం 2011 జనాభా లెక్కల ఆధారంగానే జరిగి ఉంటే, దానికి 41 స్థానాలు లభించి ఉండేవి. కానీ, అన్ని రాష్ట్రాల వాటాలను దామాషా పద్ధతిలో 50% మేర పెంచాలన్న భారత ప్రభుత్వ సూత్రం ప్రకారం, ఇప్పుడు దానికి 42 స్థానాలు లభిస్తాయి. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 80 స్థానాల ఉండగా, గణనీయంగా 140పైగా లోక్సభ స్థానాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.
ప్రతిపక్షాల వాదన ప్రకారం, కేవలం జనాభా ఆధారంగా చూస్తే తమిళనాడు సీట్లు తగ్గవచ్చు. కానీ ప్రభుత్వం ప్రతిపాదించిన ‘దామాషా పద్ధతి’లో అవి పెరిగినట్లు కనిపిస్తున్నా.. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది ప్రాబల్యం తగ్గుతుందనేది వారి అసలు పాయింట్. ప్రతిపక్షాల ఆరోపణలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తోసిపుచ్చారు. 1971 జనాభా లెక్కల ఆధారంగా ఉన్న వ్యవస్థ ఇప్పుడు కాలం చెల్లిందని ప్రభుత్వం వాదిస్తోంది. ప్రతి ప్రాంతానికి, ప్రతి వర్గానికి మేలు జరిగేలా ఈ బిల్లులను రూపొందించామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. జనాభా అదుపులో ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు కూడా సీట్లు పెరుగుతాయని, కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు కావాలంటే డీలిమిటేషన్ ప్రక్రియ తప్పనిసరి అని, 15 ఏళ్ల పాటు ఈ రిజర్వేషన్లు కొనసాగుతాయని ప్రభుత్వం గుర్తు చేస్తోంది. పెరిగిన జనాభాకు అనుగుణంగా ప్రజల సమస్యలను సభలో వినిపించడానికి సభ్యుల సంఖ్య పెరగడం ప్రజాస్వామ్యానికి అవసరమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
సోనియా గాంధీ వంటి అగ్రనేతలు సైతం రాజకీయ ప్రాతినిధ్యంలో వచ్చే ఈ పెనుమార్పులు రాజ్యాంగ సూత్రాలను దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నారు. కేవలం జనాభా ప్రాతిపదికన కాకుండా, అభివృద్ధిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. గురువారం నుండి జరగబోయే ఈ మూడు రోజుల సమావేశాలు కేవలం బిల్లుల ఆమోదానికే పరిమితం కాకుండా, ఉత్తర-దక్షిణ భారత రాష్ట్రాల మధ్య నెలకొన్న రాజకీయ, ఆర్థిక అసమానతలపై చర్చకు వేదిక కానున్నాయి. ప్రభుత్వం ఈ ఆందోళనలను ఎలా శాంతింపజేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..