
ప్రియుడితో కలిసి జీవించడానికి ఓ వివాహిత దారుణానికి ఒడిగట్టింది. దృశ్యం సినిమాలోలా హత్యను నుంచి తప్పించుకునేలా ప్లాన్ చేయగా, అది బెడిసికొట్టి పోలీసులకు దొరికిపోయింది. గుజరాత్లోని పటాన్ జిల్లాలో ఒక వృద్ధుడిని హత్య చేసిన కేసులో ఇద్దరు ప్రేమికులను అరెస్టు చేశారు. దీంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
గుజరాత్లోని జఖోట్రా గ్రామానికి చెందిన గీతా అహిర్, భరత్ వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలియకుండా భరత్తో కలిసి రాజస్థాన్కు పారిపోయి అక్కడ స్థిరపడాలని నిర్ణయించుకుంది. తాను పారిపోయినా తన కోసం ఎవరూ వెతక్కుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ రచించింది. పథకం ప్రకారం భరత్ ఒంటరిగా రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తిని అడ్డగించి హత్య చేశాడు.
తాను చనిపోయినట్టు నమ్మించేందుకు ప్రియుడు భరత్తో కలిసి హర్జీభాయ్ శవానికి తన బట్టలు వేసి, కాళ్లకు గజ్జెలు తొడిగింది. అనంతరం శవంపై పెట్రోలు పోసి నిప్పంటించి, ఇద్దరూ కలిసి అక్కడి నుంచి పారిపోయారు. తన మరణవార్త తెలిసి కుటుంబ సభ్యులు ఇక తన కోసం వెతకరని గీత భావించింది. అయినప్పటికీ దొరికిపోయి ఇప్పుడు కటకటాలు లెక్కపెట్టుకుంటోంది.
అర్ధరాత్రి ఇంట్లో గీత కనిపించకపోవడంతో ఆమె భర్త వెతకడం ప్రారంభించారు. గ్రామ శివార్లలోని కుంట సమీపంలో సగం కాలిన స్థితిలో ఉన్న డెడ్బాడీ చూసి, అది గీతదేనని తొలుత భావించారు. కానీ, కాస్త పరిశీలనగా చూడగా అది పురుషుడి శవంగా గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గీత కుటుంబసభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేయగా.. పాలన్పుర్ రైల్వే స్టేషన్లో జోధ్పుర్ వెళ్లే రైలు కోసం ఎదురుచూస్తున్న వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ సినిమాల్లోని సన్నివేశాల నుంచి స్ఫూర్తి పొంది ఈ హత్యకు పథకం రచించినట్లు గీత పోలీసుల ఎదుట అంగీకరించింది. నిందితులిద్దరినీ అరెస్టు చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..