
తిరువళ్లూరు జిల్లా తిరుత్తణిలో నాలుగేళ్ల బాలుడు గొంతులో మాత్ర ఇరుక్కుపోయి మరణించడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే.. తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి యూనియన్లో పి.ఆర్.పల్లి గ్రామానికి చెందిన వేలు, శశికళ దంపతులు నాలుగేళ్ల బాలుడితో నివసిస్తున్నారు. అయితే ఇటీవల బాలుడు యోగిత్కు జ్వరం రావడంతో తల్లిదండ్రులు చికిత్స కోసం అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాలుడిని పరీక్షించిన వైద్యుడు మందులు, మాత్రలు రాశారు. దీంతో ఇంటికి వెళ్లాక తల్లిదండ్రులు యోగిత్కు మాత్ర వేసుకోమని ఇచ్చారు. కానీ ఊహించని విధంగా మాత్ర బిడ్డ గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడక ఇబ్బంది పడ్డారు.
దీంతో కంగారుపడిపోయిన తల్లిదండ్రులు వెంటనే ఆ చిన్నారిని ఎత్తుకుని తిరుత్తణి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ వైద్యులు బాలుడిని పరీక్షించిన వైద్యులు ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. అయితే యోగిత్ చికిత్స పొందుతూనే హాస్పిటల్లో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హాస్పిటల్ ఆవరణలోనే గుండెలు పగిలేలా రోధించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న తిరుత్తణి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల కాలంలో ఇలాంటి కేసులు తరచూ వెలుగు చూస్తున్నాయి. తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందని చెబుతున్నప్పటికీ, పిల్లలపై తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ పిల్లలపై ఎల్లప్పుడూ ఓ కన్నేసి ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.ముఖ్యంగా అనారోగ్యం సమయంలో పిల్లలకు మందులు ఇచ్చేప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. తక్కువ వయస్సున్న పిల్లలకు ట్యాబ్లెట్స్ నేరుగా ఇవ్వకుండా పొడిలా చేసి వాటర్, లేదా పాలలో తాపించడం మంచిదని చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.