క్రూరమృగాలకు సైతం ప్రేమా, అప్యాయతలు ఉంటాయంటున్నారు మహారాష్ట్రలోని పెంచ్ టైగర్ రిజర్వర్ ఫీల్డ్ డైరెక్టర్ రవికిరణ్. అవి కూడా తమకు ఇష్టమైన మరో జంతువు కోసం తాపత్రయ పడతాయట. అందుకు ప్రత్యక్ష నిదర్శనంగా ఓ పులి తన ప్రేయసి కోసం దాదాపు 1300 కిలోమీటర్ల మేరా నడిచిందని, దాని కోసం వెతుక్కుంటూ వెళ్లి ఆరు జిల్లాలను దాటేసినట్లుగా అధికారులు తెలిపారు. అంతేకాదు, ప్రేమ ప్రయాణంలో ఆ పులి..తెలంగాణలో కూడా అడుగుపెట్టినట్లుగా వారు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. చివరకు హింగోలీ జిల్లాలో పులిని గుర్తించిన అధికారులు తిరిగి దానిని తన స్వస్థలానికి చేర్చారట.
మహారాష్ట్రాలోని యవత్మాల్ జిల్లా తిపేశ్వర్ టైగర్ రిజర్వ్లో జన్మించిన TWLS-T1-C1 ట్యాగ్ ఉన్న ఒక పులి ఆరు జిల్లాలు దాటుకుంటూ ప్రయాణించింది. చివరకు కొత్త ప్రాంతానికి చేరుకునేందుకు దానికి 150 రోజులు పట్టిందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది జూన్ నుంచి ఈ పులి కనిపించలేదని పెంచ్ టైగర్ రిజర్వర్ ఫీల్డ్ డైరెక్టర్ రవికిరణ్ తెలిపారు. T1-C1 అనే ఈ పులి TWLS-T1 అనే పులికి 2016లో జన్మించిందని చెప్పారు. ఈ పులికి C2, C3 అనే మరో రెండు పులులు కూడా జన్మించాయని అధికారి వెల్లడించారు. ఈ మూడు పులులు 2019లో తల్లి నుంచి వేరైనట్లుగా చెప్పారు. ఇక అప్పటి నుంచి ఈ పులులపై నిఘా పెట్టినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే ఈ పులులు ఒక్కసారి తల్లి నుంచి వేరయ్యాయంటే తమ సొంత గూటిలో ఉండేందుకు ఇష్టపడతాయని ఈ క్రమంలోనే కొత్త ప్రాంతాల్లో సంచరిస్తాయని చెప్పారు. తిపేశ్వర్ టైగర్ రిజర్వ్ను వీడి C1 మరియు C3 పులులు తెలంగాణ సరిహద్దులోని పంధరఖవడా డివిజన్లో సంచరించినట్లు అధికారులు తెలిపారు.
శాటిలైల్ లొకేషన్ చూస్తే ఈ C1 అనే ఈ పులి ద్యాన్గంగా శాంక్చురీకి చేరిందని చెప్పారు మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ ఎంఎస్ రెడ్డి. ఈ అడవిలో చాలా జంతువులు ఉంటాయని చెప్పారు. ఇక మేల్ఘాట్ ల్యాండ్స్కేప్కు 50 కిలోమీటర్ల దూరంలో ఈ పులి ఉన్నట్లు ఆయన చెప్పారు. అయితే ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికర విషయం ఏమిటంటే… తన ప్రేయసి కోసం వెతుకుతూ వెళ్లిన ఈ పులి ఆరు జిల్లాలు దాటింది. పొలాల్లో తిరిగింది. కానీ ఎక్కడా మనుషులపై దాడి చేయలేదని ఎంఎస్ రెడ్డి చెప్పారు. అది బతికేందుకు మాత్రం కొన్ని జంతువులపై దాడి చేసిందని చెప్పారు. హింగోలీ జిల్లాలో మాత్రం పులిని పసిగట్టిన గ్రామస్తులు వెంటనే అధికారులు దృష్టికి తీసుకొచ్చారని రవికిరణ్ చెప్పారు. అయితే పులులు కూడా తమకు ఇష్టమైన ఇతర పులుల కోసం కొన్ని వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళతాయనేది నగ్న సత్యం అని, అయితే ఇది ఎవరూ నమ్మరని అంటున్నారు అధికారులు.