
మావోయిస్టులు ఇవాళ భారత్బంద్కి పిలుపునిచ్చారు. దీంతో దండకారణ్యంతోపాటు, చుట్టుపక్కల ప్రాంతాల్లో హింసా, విధ్వంసాలకు దిగుతున్నారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మూడు వాహనాలను తగులబెట్టారు. కుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని పందిగూడా-అసర్గూడ మార్గమధ్యంలో ఒక బస్సు,ఒక టిప్పర్, ఒక కారును తగలబెట్టారు.
భద్రాద్రి కొత్తగూడెంలో మావోయిస్టులు సెల్టవర్ను తగులబెట్టారు. దుమ్ముగూడెం మండలం, పైడిగూడెం గ్రామంలో సెల్ టవర్కు నిప్పుబెట్టారు. ఈ పరిస్థితుల్లో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ములుగు, జయశంకర్ భూపాలపల్లిల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. మావోయిస్టుల హింసతో ప్రజలు భయపడుతున్నారు. ఇక కమలాపురంతో పాటు, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టు కరపత్రాలు, వాల్ పోస్టర్లు వెలిశాయి.
ఇప్పటికే అల్లూరి జిల్లాలో రోడ్డు మీద కారును తగులబెట్టారు మావోయిస్టులు. ఉపా కేసులు రద్దు చేయాలనీ, NIA దాడులు ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. వీటితోపాటు ఎన్కౌంటర్లు లేని సమాజం కావాలంటూ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో పోస్టర్లు, బ్యానర్లలో కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోని దండకారణ్యం జోన్, దాని సమీప ప్రాంతాల్లో పోలీసులు అలర్ట్గా ఉన్నారు.
ఏజన్సీ ఏరియాల్లో హైఅలర్ట్
మావోయిస్టుల భారత్ బంద్తో తెలంగాణ వ్యాప్తంగా ఏజన్సీ ఏరియాల్లో హైఅలర్ట్ కొనసాగుతోంది. కొన్నిరోజులుగా మావోయిస్టుల ఏరివేతకు జరుగుతున్న కూంబింగ్.. దానికి నిరసనగా.. పలు ఘటనలు చోటుచేసుకున్నాయి. మావోయిస్ట్ పార్టీ భారత్ బంద్ నేపథ్యంలో మహారాష్ట్ర గడ్చిరోలి – తెలంగాణ సరిహద్దులో హై అలర్ట్ కొనసాగుతోంది. డ్రోన్ కెమెరాలతో ప్రాణహిత తీరాన్ని జల్లెడ పడుతున్నాయి కూబింగ్ బలగాలు. ప్రాణహిత నదిపై డ్రోన్ చక్కర్లు కొడుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన వేమనపల్లి సమీపంలోని కళ్లంపల్లి, ముక్కిడిగూడెం, సుంపుటం గ్రామాల్లో అదనపు బలగాలు మోహరించాయి.
నివురుగప్పిన నిప్పులా భద్రాచలం ఏజన్సీ ఏరియా కనిపిస్తోంది. కొద్ది రోజులుగా వరుస విధ్వంస ఘటనలకు పాల్పడుతున్నారు మావోయిస్టులు. తెలంగాణ, ఏపీ, ఛత్తీస్ గఢ్ సరిహద్దులో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. భద్రాచలం నుంచి చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం,చింతూరుకు వెళ్లే ఆర్టీసీ బస్సులను రద్దుచేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి