
భారత రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. దేశవ్యాప్తంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను వేగవంతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఏప్రిల్ 16, గురువారం రోజున పార్లమెంటులో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం తెలిపింది. పార్లమెంటుకు సంబంధశించిన అధికారిక అజెండా వెలువడటంతో రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది.
కేంద్రం నిర్ణయంతో అప్రమత్తమైన ప్రతిపక్ష ‘ఇండియా’ (INDIA) కూటమి తమ తదుపరి కార్యాచరణను ఖరారు చేసేందుకు సిద్ధమైంది. ఈ బిల్లుపై చర్చించేందుకు బుధవారం (ఏప్రల్ 15) మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నివాసంలో కూటమి నేతలు కీలక సమావేశం నిర్వహించనున్నారు. కేంద్రం ప్రతిపాదనలను ఎలా ఎదుర్కోవాలి, రాష్ట్రాల వారీగా జరిగే మార్పులపై ఎలా స్పందించాలనే అంశంపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించనున్నారు.
ఇదిలావుంటే, 131వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభ స్థానాల సంఖ్యను భారీగా పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. ప్రస్తుతం ఉన్నా 543 లోక్సభ స్థానాల సంఖ్యను ఏకంగా 850కి పెంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన చేస్తోంది. ఈ క్రమంలోనే వివిధ రాష్ట్రాలకు కలిపి 815 లోక్సభ స్థానాలను కేటాయించనున్నారు. కేంద్ర పాలిత ప్రాంతాలకు 35స్థానాలను ప్రతిపాదించారు. ఆర్టికల్ 55, ఆర్టికల్ 81 సవరణల కోసం 131వ రాజ్యాంగ సవరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.
ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లు రానుండటంతో, ఇప్పటికే ఎంపీలకు ప్రాథమిక సమాచారం అందినట్లు తెలుస్తోంది. జనాభా ప్రాతిపదికన జరిగే ఈ విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందనే ఆందోళనలు గతంలోనే వ్యక్తమయ్యాయి. డీలిమిటేషన్ బిల్లుపై తమిళనాడు సీఎం స్టాలిన్ కేంద్రానికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. పార్లమెంట్ ఈ బిల్లును ఆమోదిస్తే తమిళనాడులో భారీ ఉద్యమం చేపడుతామని ప్రకటించారు. ఇప్పటివరకు ఎవరు చూడని ఉద్యమాన్ని చేపడుతానని హెచ్చరించారు. 1960 నాటి డీఎంకేను మళ్లీ పరిచయం చేస్తానని అన్నారు. డీలిమిటేషన్కు వ్యతిరేకంగా కాంగ్రెస్తో కలిసి పోరాటం చేస్తామన్నారు. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరగుతుందని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
కేంద్రం ప్రవేశపెట్టబోయే ఈ 131వ రాజ్యాంగ సవరణ బిల్లుదేశ రాజకీయ చిత్రపటాన్ని ఎలా మార్చబోతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. కూటమి నేతలు ఈ ప్రతిపాదనలను ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తారా లేదా సవరణలు కోరుతారా అనేది బుధవారం జరిగే భేటీ అనంతరం తేలనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..