Tourism Capital: జమ్ము-కశ్మీర్‌ ‘టెర్రరిజం’ కేపిటల్ కాదు – ‘టూరిజం’ కేపిటల్

ఒకప్పుడు ‘టెర్రరిజం కేపిటల్‌’గా ముద్రపడ్డ కశ్మీర్ ఇప్పుడు ‘టూరిజం కేపిటల్‌’గా మారుతోందని భారతీయ జనతా పార్టీ

Tourism Capital: జమ్ము-కశ్మీర్‌ టెర్రరిజం కేపిటల్ కాదు – టూరిజం కేపిటల్
Jammu And Kashmir

Updated on: Aug 19, 2021 | 6:11 PM

Jammu And Kashmir – Tarun Chung Tourism Capital: ఒకప్పుడు ‘టెర్రరిజం కేపిటల్‌’గా ముద్రపడ్డ కశ్మీర్ ఇప్పుడు ‘టూరిజం కేపిటల్‌’గా మారుతోందని భారతీయ జనతా పార్టీ జమ్ము-కశ్మీర్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ అన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ పదవి చేపట్టినప్పటి నుంచి జమ్ము-కశ్మీర్ కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నారని, ఆర్టికల్ 370 రద్దు తర్వాత సరికొత్త జమ్ము-కాశ్మీర్ ఆవిష్కృతమైందని ఆయన వ్యాఖ్యానించారు. బానిస సంకెళ్లను తెంపుకుని స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్న కశ్మీర్, శాంతి దిశగా పరుగులు తీస్తోందని ఆయన తెలిపారు.

గురువారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన తరుణ్.. జమ్ము-కశ్మీర్‌లో ఎన్నికల ప్రక్రియ జరుగుతోందని, పంచాయితీ, బ్లాక్, జిల్లా పంచాయత్ ఎన్నికలు జరిగాయని చెప్పారు. వీలైనంత త్వరలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని అన్నారు. గతంలో ఒకటి, రెండు శాతానికే పరిమతమయ్యే పోలింగ్, ఇప్పుడు మారుతున్న కశ్మీర్‌లో 54 నుంచి 65 శాతం వరకు నమోదవుతోందని తెలిపారు.

ప్రజలు పెద్ద సంఖ్యలో బయటికొచ్చి ఓటు వేస్తున్నారని తరుణ్ చుగ్ చెప్పారు. డీ-లిమిటెషన్ కసరత్తు కూడా చురుగ్గా సాగుతోందని, డీ-లిమిటేషన్ కమిషన్ అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకుంటోందని చెప్పారు. త్వరలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు కశ్మీర్ లోయలో టూరిజం ఊపందుకుందని, దేశంలో ఇతర ప్రాంతాల కంటే ఎక్కువ రద్దీ కశ్మీర్ లోయలోని శ్రీనగర్, గుల్మార్గ్, అనంతనాగ్, బారాముల్లాలో కనిపిస్తోందని ఆయన అన్నారు.

లోయలో హోటలు గదులన్నీ నిండిపోయాయని, గదులు దొరకడం కష్టంగా మారిందని తెలిపారు. అఫ్ఘానిస్తాన్ పరిణామాల ప్రభావం కాశ్మీర్‌పై పెద్దగా ఉండదని, ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే సత్తా భారతదేశానికి ఉందని తరుణ్ చుగ్ చెప్పుకొచ్చారు.

Tarun

Read also: Cyber Crime: సైబర్ నేరాలపై ప్రత్యేక వ్యవస్థ.. ఆన్‌లైన్లో ఫిర్యాదు చేసెయ్యండిలా..!