Sushant Case Updates: బాలీవుడ్ నటుడు సుశాంత్ మృతి కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసులో డ్రగ్స్ కోణం బయటకు పడటంతో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) పలువురిని విచారణ జరిపింది. ఈ క్రమంలో సుశాంత్ గర్ల్ఫ్రెండ్ రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తి, సుశాంత్ హౌజ్ మేనేజర్ శామ్యూల్ మిరిందాలను అదుపులోకి తీసుకున్న ఎన్సీబీ అధికారులు ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు. సుశాంత్కి డ్రగ్స్ సరఫరా చేయడంతో పాటు డ్రగ్స్ వ్యాపారులతో సంబంధాల కారణంగా షోవిక్ను అరెస్ట్ చేశారు. సుదీర్ఘ విచారణ తరువాత షోవిక్ను అదుపు లోకి తీసుకున్నారు. ఇక షోవిక్ని శనివారం కోర్టులో హాజరుపర్చనున్నారు. కాగా ఈ విచారణలో షోవిక్ పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రియానే డ్రగ్స్ తీసుకురమ్మని చెప్పినట్లు షోవిక్, ఎన్సీబీకి చెప్పినట్లు సమాచారం.
సుశాంత్కు డ్రగ్స్ తీసుకురావాలని రియా తనను పదేపదే కోరిందని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో షోవిక్ వెల్లడించాడు. దీంతో డ్రగ్స్ వ్యవహారంలో రియా డైరెక్ట్ లింక్ బయటపడింది. షోవిక్, శామ్యూల్ మిరిందాలు డ్రగ్ డీలర్ జైద్ నుంచి గంజాయి కొన్నట్లు ఆధారాలు దొరికాయి. దీంతో జాయిద్ను అధికారులు అరెస్ట్ చేశారు. ఇంటరాగేషన్లో అతను ఇచ్చిన సమాచారం మేరకే.. రియా, శామ్యూల్ మిరిందా ఇళ్లలో ఈ ఉదయం ఎన్సీబీ సోదాలు చేసింది. ఇక శ్యాముల్ మిరిండాకు డ్రగ్స్ సరఫరా చేసిన ఇద్దరు స్మగ్లర్లను కూడా అదుపు లోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా సుశాంత్కు డ్రగ్స్ అలవాటు చేసింది రియా చక్రవర్తే అని అతడి కుటుంబ సభ్యులు పదేపదే ఆరోపించింది. ఇదిలా ఉంటే మరోవైపు సుశాంత్ కేసులో సీబీఐ, ఈడీ విచారణ కూడా కొనసాగుతోంది.
Read More:
రుణం తీసుకునేందుకు ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్కి అనుమతి
గంగూలీ సర్ ‘వంటలక్క’ను చూడాలి.. ‘ఐపీఎల్’ టైమింగ్ని మార్చండి ప్లీజ్