Bankruptcy Law Amendments: రియల్ ఎస్టేట్ సంస్థలపై చర్యల కోసం గత సంవత్సరం దివాలా చట్టానికి పార్లమెంట్ చేసిన సవరణలను సుప్రీం కోర్టు సమర్ధించింది. ఈ అంశంలో శాసన వ్యవస్థకు దురుద్దేశాలు ఆపాదించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎవరైనా బిల్డర్ ఒప్పందం ప్రకారం తన బాధ్యత నిర్వర్తించకపోతే ఆ ప్రాజెక్టులో ఇల్లు లేదా ప్లాటు కొన్న వ్యక్తి అయినా దివాలా ప్రక్రియ చేపట్టేందుకు ఇంతకు ముందు అవకాశం ఉండేది.
దీనిని కొనుగోలుదార్లలో వంద మంది లేదా కేటాయింపులు పొందిన వారిలో కనీసం పది శాతానికి పెంచుతూ గత ఏడాది పార్లమెంట్ సవరణలు ఆమోదించింది. రియల్ ఎస్టేట్ లాబీకి లొంగిపోయి ఈ సవరణలు చేశారన్న పిటిషనర్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఒక వ్యక్తికి కూడా బిల్డర్లపై దివాలా ప్రక్రియ చేపట్టే హక్కు ఉంటే, అది దుష్పరిణామాలకు దారి తీస్తుందని సుప్రీం కోర్టు పేర్కొంది.