Sonu Sood: సోనూ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు.. ఐటీ అధికారులు ఏం తేల్చారంటే..?

|

Sep 19, 2021 | 2:37 PM

Sonu Sood: గతవారం బాలీవుడ్ నటుడు సోనూసూద్, ఆయన అనుచరులకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో దాడులు జరిగాయి. ముంబై, లక్నో, కాన్పూర్, జైపూర్, ఢిల్లీ, గుర్గావ్ తదితర ప్రాంతాల్లోని  28 చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.

Sonu Sood: సోనూ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు.. ఐటీ అధికారులు ఏం తేల్చారంటే..?
Sonu Sood
Follow us on

Sonu Sood: గతవారం బాలీవుడ్ నటుడు సోనూ సూద్, ఆయన అనుచరులకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో దాడులు జరిగాయి. ముంబై, లక్నో, కాన్పూర్, జైపూర్, ఢిల్లీ, గుర్గావ్ తదితర ప్రాంతాల్లోని  28 చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. కొవిడ్ మహమ్మారి వేళ ఆపన్న హస్తం అందించిన సోనూ భాయ్ రియల్ హీరో అనిపించుకున్నారు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలతో దేశ ప్రజల మనసులో నిలిచిపోయారు. దేశ వ్యాప్తంగా సోనూ‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా పెరిగింది.  ఈ నేపథ్యంలో ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు దాడులు చేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సోనూ సూద్, ఆయన అనుచరుల ఇళ్లపై ఉన్నట్టుండి ఐటీ దాడులు ఎందుకు జరిగాయి? ఇప్పుడు దేశ వ్యాప్తంగానూ ఇదే హాట్ టాపిక్.

సోనూ సూద్ 20 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు ఐటీ శాఖ వెల్లడించింది. ఆ మేరకు తమ దాడుల్లో పక్కా ఆధారాలను సేకరించినట్లు ఐటీ అధికారులు చెబుతున్నారు.   మూడురోజుల పాటు ఐటీ అధికారులు ఈ సోదాలు చేపట్టారు.  పన్ను ఎగవేత ఆరోపణలతో.. సోనూ ఆర్థిక లావాదేవీలను అధికారులు పరిశీలించారు. ఈ సోదాల్లో రూ.1.8 కోట్ల నగదును సీజ్ చేయడంతో పాటు 11 లాకర్లను సీజ్ చేశారు.  సోనూ సూద్ ఫారిన్ కంట్రిబ్యూషన్ యాక్ట్‌ను ఉల్లంఘించారని నిర్ధారించినట్లు ఐటీ ఆఫీసర్లు చెబుతున్నారు. అలాగే తన ఇన్ఫ్రా కంపెనీ ద్వారా బోగస్ బిల్లింగ్‌కు పాల్పడినట్లు తేల్చారు.  క్రౌడ్‌ ఫండింగ్ ద్వారా విదేశీ దాతల నుంచి 2.1 కోట్లను సేకరించినట్లు ఐటీ విభాగం తెలిపింది. సోనూసూద్‌తో పాటు ఆయన సహచరుల కార్యాలయాల్లో రూ.20 కోట్ల పన్ను ఎగవేతకు సంబంధించిన ఆధారాలను గుర్తించినట్లు ఐటీ అధికారులు వెల్లడించారు.

ఫస్ట్‌ వేవ్ సమయంలో సోనూ ఏర్పాటు చేసిన దాతృత్వ సంస్థ 18 కోట్లకు పైగా విరాళాలను సేకరించిందని ఐటీ అధికారులు వెల్లడించారు. అందులో 1.9 కోట్లు మాత్రమే సహాయ కార్యక్రమాలకు వినియోగించారని, మిగతా డబ్బు ఆ సంస్థ ఖాతాలోనే ఉండిపోయిందని ఐటీ అధికారులు చెబుతున్నారు.

సోనూ సూద్ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ సోదాలు జరపడంపై ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆప్ ప్రభుత్వం ఇటీవల సోనూను తమ ప్రభుత్వ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుందే. అందుకే సోనూను బీజేపీ టార్గెట్ చేస్తోందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.  సోనూపై ఐటీ దాడులు రాజకీయ ప్రేరేపిత దాడులుగా వారు ఆరోపిస్తున్నారు.  కానీ ఆ ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది. అధికారులు వారి పని వారు చేశారని, దీంట్లో రాజకీయం లేదని స్పష్టం చేసింది కమలం పార్టీ.

అయితే తన ఇళ్లు, కార్యాలయపై ఐటీ సోదాలు జరగడంపై స్పందించేందుకు సోనూ సూద్ నిరాకరించారు. జాతీయ మీడియా ప్రతినిధులు ఆయనతో మాట్లాడేందుకు ఫోన్‌లో ప్రయత్నించినా.. ఆయన స్పందించలేదు.

Also Read..

ట్రాఫిక్ పోలీసులకు షాకిచ్చిన ఆకతాయిలు.. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో ఊదమంటే బ్రీత్‌ ఎనలైజర్‌తో ఎస్కేప్‌..

 ప్రపంచ శాంతి కోసం ప్రత్యేక చొరవ.. చిన్నజీయర్ స్వామి‌కి ప్రధాని మోదీ అభినందనలు