
కేంద్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా అధికార దుర్వినియోగానికి పా ల్పడుతోందని, అన్ని వ్యవస్థలనూ తమ స్వలాభం కోసం వాడుకుంటోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ ఆరోపించారు.శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ పెద్దల చర్యలను పరికిస్తే ప్రజాస్వామ్యం కంటే తామే అధికులమన్న భావన వారిలో వ్యక్తమవుతోందన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలో విద్వేషం, హింసను ప్రేరేపిస్తున్నాయని, ప్రధానమంత్రి ఉద్దేశపూర్వకంగానే వాటిని విస్మరిస్తున్నారని మండిపడ్డారు.
దేశంలో రాజ్యాంగ పరిరక్షణమే తమ ధ్యేయమని, ఇందుకోసం భావసారూప్యం కలిగిన రాజకీయ పార్టీలతోనే చేతులు కలుపుతామని, కలిసి పని చేస్తామని ఓ పత్రికకు రాసిన వ్యాసంలో సోనియా వెల్లడించారు. శాంతి, సామరస్యం కోసం ప్రధాని ఏనాడూ పిలుపునివ్వలేదని ఆక్షేపించారు. మతం, ఆహారం, కులం, భాష పేరిట ప్రజలపై వివక్ష చూపుస్తూ.. భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే కొన్ని నెలల్లో ముఖ్య రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నందున ఈ సమయం దేశ ప్రజస్వామ్యానికి అగ్ని పరిక్షలాంటిదేనని తెలిపారు. ప్రతిపక్ష నాయకులపై లెక్కలేనన్ని కేసులు పెడుతున్నారని ఒకవేళ వాళ్లు బీజేపీలో చేరితే అవన్నీ మాయమవుతున్నాయని విమర్శించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..