Snake In Mid-Day Meal: మధ్యాహ్న భోజనంలో పాము పిల్ల ప్రత్యక్షం.. చూడకుండా తినేసిన వందలాది మంది బడి పిల్లలు! ఆ తర్వాత
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే భోజన నాణ్యతకు సంబంధించిన వార్తలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. నాసిరకం భోజనం వడ్డించి బడి పిల్లల ఆరోగ్యంతో చలగాటమాడుతున్న ఉదంతాలు నిత్యం దేశంలో ఏదో ఒక మూల చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ సారి ఏకంగా ఓ పాము పిల్ల మధ్యాహ్న భోజనంలో ప్రత్యక్షమైంది. ఈ భోజనం తిని వందలాది మంది విద్యార్ధులు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. ఈ దారుణ ఘటన బీహార్లోని సహర్సా జిల్లాలో గురువారం (మే 7) చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?

బీహార్లోని సహర్సా జిల్లాలోని మహిషి బ్లాక్ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు గురువారం మధ్యాహ్న భోజనం అందించారు. భోజనంలో అన్నం, పప్పు వడ్డించారు. ఓ విద్యార్ధికి భోజనం పెడుతున్న క్రమంలో ప్లేట్లో ఓ పాము పిల్ల కనిపించింది. దీంతో దాన్ని చూసిన పిల్లలంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. స్కూల్ యాజమాన్యం తేరుకునే లోపే చాలామంది విద్యార్థులు ఆ ఆహారాన్ని తినేశారు. అనంతరం కాసేటికే పిల్లలందరూ ఒకరి తర్వాత ఒకరుగా కడుపునొప్పి, తల తిరగడం, వాంతులు లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. మొత్తం 250 మందికి పైగా విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు.
గమనించిన పాఠశాల ఉపాధ్యాయులు పోలీసులకు, ఆస్పత్రికి సమాచారం అందించారు. కొద్దిసేపట్లోనే అక్కడికి చేసుకున్న పోలీసులు తమ సొంత వాహనాల్లో కొంతమంది పిల్లలను స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. మిగిలిన పిల్లలను ఆసుపత్రి నుంచి వచ్చిన అంబులెన్స్లలో తరలించారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు రావడంతో ఆరోగ్య కేంద్రంలో భారీ రద్దీ ఏర్పడింది. కొంతమంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వారిని సదర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సహర్సాలోని మహిషి బ్లాక్లో ఉన్న బలువాహా మిడిల్ స్కూల్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రతిరోజూ లాగే గురువారం కూడా ఓ NGO సంస్థ సరఫరా చేసిన మధ్యాహ్న భోజనాన్ని పాఠశాల విద్యార్థులకు అందించారు. అయితే ఊహించని విధంగా ఈ ఆహారంలో పాము పిల్ల రావడంతో విద్యార్ధులంతా ఆస్పత్రి పాలయ్యారు. సమాచారం అందిన జిల్లా యంత్రాంగం, ఆరోగ్య శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరి ఆరోగ్యం నిలకడగా ఉండని వైద్యులు తెలపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన తల్లిదండ్రులలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఆవరణలో పెద్ద సంఖ్యలో గుమిగూడి ఆందోళన చేపట్టారు. ఈ స్కూల్తోపాటు పలు స్థానిక పాఠశాలలకు మధ్యాహ్న భోజనం వండే NGO సంస్థకు దర్యాప్తు బృందాన్ని పంపించారు. విచరాణ నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో స్థానికులు ఆందోళన విరమించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




