
దేశవ్యాప్తంగా ఇటీవల బస్సు ప్రమాదాలు చోటు చేసుకుని.. పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. అయితే.. ప్రైవేట్ ట్రావెల్స్.. స్లీపర్ బస్సుల్లో జరుగుతున్న ప్రమాదాలను నిలువరించేందుకు NHRC రంగంలోకి దిగింది. మానవ హక్కుల రక్షణ చట్టం కింద భద్రతా నిబంధనలను ఉల్లంఘించే అన్ని స్లీపర్ కోచ్ బస్సులను తొలగించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో జరిగిన బస్సు ప్రమాదాల్లో మంటల్లో చిక్కుకొని ప్రయాణికులు మరణించిన ఘటనలపై ఎన్హెచ్ఆర్సీ కి ఫిర్యాదులు అందాయి. ప్రజా రవాణా బస్సుల రూపకల్పనలో ఉన్న లోపాలు ప్రయాణీకుల ప్రాణాలకు ముప్పుగా ఉందని NHRC కి ఫిర్యాదులు అందాయి. కొన్ని బస్సుల్లో డ్రైవర్ క్యాబిన్ ప్రయాణీకుల కంపార్ట్మెంట్ నుండి పూర్తిగా వేరు చేసి ఉందని.. ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రయాణీకులు మంటలను సకాలంలో గుర్తించడంలో అడ్డంకిగా మారిందని.. దీనివల్ల ప్రయాణీకులు మంటల్లో చిక్కుకొని మరణించిన ఇటీవల సంఘటనలు NHRC దృష్టికి వచ్చాయి..
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే ప్రాథమిక హక్కును కాల రాసేలా స్లీపర్ క్లాస్ బస్సుల్లో నిబంధనల ఉల్లంఘన జరుగుతుందని పలువురు ఫిర్యాదు చేశారు. ప్రమాద ఘటనలు బస్సుల తయారు చేసే కంపెనీలు, వాటి ఫిట్నెస్ ను ఆమోదించే అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉన్నాయని.. భద్రత ప్రమాణాలు పెంపొందించడంతో పాటు బాధిత కుటుంబాలకు పరిహారం నిర్థారించడానికి జోక్యం చేసుకొవాలని పిటిషన్ లో అభ్యర్థించారు.
ఈ పిటిషన్ పై మానవ హక్కుల రక్షణ చట్టం – 1993, సెక్షన్ 12 కింద ఎన్హెచ్ఆర్సీ మెంబర్ ప్రియాంక్ కనూంగో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించే స్లీపర్ కోచ్ బస్సులు తొలగించాలని తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల సీఎస్ లకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయ రహదారులు శాఖ సెక్రటరీ, మహారాష్ట్రలోని పూణేలోని సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ డైరెక్టర్ కు నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఈ బస్సు ఘటనలపై తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదికను రెండు వారాల్లో సమర్పించాలని స్పష్టం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..