Serial Killer: 14 నెలల్లో 9 మంది మహిళల్ని చంపిన సీరియల్ కిల్లర్‌.. అన్నీ ఒకే తరహాలో!

|

Aug 09, 2024 | 11:37 AM

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో గడచిన 14 నెలల్లో ఒకే వయస్సున్న తొమ్మిది మంది మహిళలు ఒకే తరహాలో హత్యకు గురయ్యారు. మృతి చెందిన మహిళలందరినీ వారు ధరించిన చీరలతోనే గొంతుకు బిగించి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇది సీరియల్‌ కిల్లర్ పనేనంటూ, గుర్తు తెలియని అగంతకుడి కోసం గాలింపు ప్రారంభించారు. బరేలీ జిల్లాలోని షాహి, షీష్‌గఢ్, షెర్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలలో..

Serial Killer: 14 నెలల్లో 9 మంది మహిళల్ని చంపిన సీరియల్ కిల్లర్‌.. అన్నీ ఒకే తరహాలో!
Serial Killer
Follow us on

లక్నో, ఆగస్టు 9: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో గడచిన 14 నెలల్లో ఒకే వయస్సున్న తొమ్మిది మంది మహిళలు ఒకే తరహాలో హత్యకు గురయ్యారు. మృతి చెందిన మహిళలందరినీ వారు ధరించిన చీరలతోనే గొంతుకు బిగించి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇది సీరియల్‌ కిల్లర్ పనేనంటూ, గుర్తు తెలియని అగంతకుడి కోసం గాలింపు ప్రారంభించారు. బరేలీ జిల్లాలోని షాహి, షీష్‌గఢ్, షెర్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలలో ఈ హత్యలు జరిగాయి. గతేడాది 40-65 ఏళ్ల మధ్య వయసున్న ఎనిమిది మంది మహిళలు హత్యకు గురయ్యారు. వీరందరి మృతదేహాలు చెరకు పొలాల్లోనే లభ్యమయ్యాయి. వారు ధరించిన చీరతో గొంతు నులిమి హత్య చేయడం విశేషం. కానీ ఏవరిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆధారాలు లభ్యం కాలేదు. ఇలా గతేడాది జూన్‌లో మూడు హత్యలు, జూలై, ఆగస్టు, అక్టోబర్‌లలో ఒక్కొక్కటి, నవంబర్‌లో రెండు హత్యలు జరిగాయి.

ఆయా గ్రామాలకు 25 కి.మీ పరిధిలో ఈ హత్యలు జరగడం గ్రామస్థుల్ని ఆందోళనకు గురి చేస్తున్నది. మృతులంతా 45-55 ఏండ్ల వయస్కులే. ఎనిమిదో హత్య జరిగిన తర్వాత దాదాపు 300 పోలీసుల బలగాలతో 14 బృందాలు హంతకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. వీరంతా మఫ్టీలో ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ నిఘా పెట్టారు. ఆ తర్వాత చాన్నాళ్ల వరకు హత్యలు జరగలేదు. దీంతో స్థానికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ ఏడాది ఆగస్టులో మళ్లీ ఇదే తరహాలో తొమ్మిదో హత్య జరిగింది. 7 నెలల గ్యాప్‌ తర్వాత 45 ఏళ్ల అనిత అనే మహిళను గొంతు నులిమి హత్య చేశారు. ఆమె మృతదేహం జులైలో చెరకు పొలంలో లభ్యమైంది.

షేర్‌ఘర్‌లోని భుజియా జాగీర్ గ్రామానికి చెందిన అనిత ఫతేగంజ్‌లోని ఖిర్కా గ్రామంలోని తల్లి ఇంటికి వెళ్లింది. జులై 2న ఇంటి నుంచి బయల్దేరి డబ్బు డ్రా చేసేందుకు బ్యాంకుకు వెళ్లింది. ఆ తర్వాత ఆమె కనిపించకుండా పోయింది. అనూహ్యంగా చెరకు తోటలో ఆమె మృతదేహం లభ్యం కాగా, ఆమె చీరతో గొంతు నులిమి హత్య చేసినట్లు పోస్టుమార్టంలో తేలింది. గతేడాది జరిగిన హత్యల వెనుక సీరియల్ కిల్లర్ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జూలైలో జరిగిన తాజా హత్య ఆ అనుమానాలకు బలం చేకూరుస్తోందని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనురాగ్ ఆర్య, పోలీసు సూపరింటెండెంట్ మనుష్ పరీక్ అన్నారు. హత్యలు జరిగిన ప్రాంతాల్లో 90 గ్రామాలకు చెందిన పలువురితో మాట్లాడిన పోలీసులు ముగ్గురు అనుమానితుల ఊహా చిత్రాలను విడుదల చేశారు. వారిలో ఎవరైనా తమ కంటబడితే బరేలీలోని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సౌత్) ఆఫీస్‌కు 9554402549, 9258256969 ఫోన్‌ నంబర్లకు కాల్ చేయాలని సూచించారు. ఈ వరుస హత్యల వెనుక సీరియల్‌ కిల్లర్‌ ఉండొచ్చన్న విషయాన్ని కొట్టి పారేయలేమని యూపీ డీజీపీ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. కేసును ఛేదించేందుకు అన్ని మార్గాల్లో దర్యాప్తు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.