‘వారు శరణార్థులు కాదు.. దేశం కోసం పోరాడిన యోధులు’.. మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు

దేశ విభజన, పాకిస్థాన్ నుంచి భారతదేశానికి వలస వచ్చిన ప్రజల గురించి రాష్ట్రీయ స్వయంసేవక్ సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాగ్‌పూర్‌లో జరిగిన సింధు ఎడ్యుకేషన్ సొసైటీ 75వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, 1947 విభజన అనంతరం పాకిస్థాన్ నుంచి భారతదేశానికి వచ్చిన వారిని "శరణార్థులు"గా కాకుండా "యోధులు"గా చూడాలని అన్నారు. తమ మాతృభూమి, మతం పట్ల ఉన్న అచంచల విశ్వాసంతో వారు ఎన్నో కష్టాలను భరించి భారతదేశానికి వచ్చారని పేర్కొన్నారు.

వారు శరణార్థులు కాదు.. దేశం కోసం పోరాడిన యోధులు.. మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
Rss Chief Mohan Bhagwat

Updated on: Jul 02, 2026 | 7:58 AM

దేశ విభజన, పాకిస్థాన్ నుంచి భారతదేశానికి వలస వచ్చిన ప్రజల గురించి రాష్ట్రీయ స్వయంసేవక్ సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం (జూలై 02) నాగ్‌పూర్‌లో జరిగిన సింధు ఎడ్యుకేషన్ సొసైటీ 75వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, 1947 విభజన అనంతరం పాకిస్థాన్ నుంచి భారతదేశానికి వచ్చిన వారిని “శరణార్థులు”గా కాకుండా “యోధులు”గా చూడాలని అన్నారు. తమ మాతృభూమి, మతం పట్ల ఉన్న అచంచల విశ్వాసంతో వారు ఎన్నో కష్టాలను భరించి భారతదేశానికి వచ్చారని పేర్కొన్నారు.

భారతదేశంలో భయం లేకుండా తమ మతాన్ని ఆచరించే స్వేచ్ఛ కోసం వారు స్వచ్ఛందంగా తమ ఇళ్లు, ఆస్తులు, వ్యాపారాలు, తరతరాలుగా సంపాదించుకున్న సంపదను వదులుకుని వచ్చారని మోహన్ భగవత్ గుర్తు చేశారు. అలాంటి త్యాగం చేసిన వారిని శరణార్థులుగా పిలవడం సరికాదని, వారు దేశం, ధర్మం కోసం పోరాడిన యోధులని అభివర్ణించారు. దేశ విభజనను ప్రస్తావిస్తూ, ఆ పోరాటంలో కేవలం ఆ ప్రజలే కాదు, భారతదేశాన్ని ఐక్యంగా ఉంచాలనుకున్న మనమందరం ఓడిపోయామని ఆయన వ్యాఖ్యానించారు. అయినప్పటికీ వారు వ్యక్తిగత సౌకర్యాలు, సంపద, ఉద్యోగాలను కాకుండా దేశాన్ని, మతాన్ని ఎంచుకున్నారని కొనియాడారు.

ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు వెనక్కి తగ్గకూడదని మోహన్ భగవత్ సూచించారు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొని, పడిపోయిన ప్రతిసారీ మళ్లీ లేచి ముందుకు సాగాలని చెప్పారు. పరిస్థితులకు లొంగిపోవడం ఓటమిని అంగీకరించినట్లేనని, కష్టాలను అధిగమించిన వారే చివరకు విజయం సాధిస్తారని పేర్కొన్నారు.

విద్య ప్రాముఖ్యతపై కూడా ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఉద్యోగం సంపాదించడం కోసం మాత్రమే విద్య ఉండకూడదని, మంచి-చెడులను గుర్తించే వివేకాన్ని పెంపొందించే విలువలతో కూడిన విద్య అవసరమని అన్నారు. పుస్తకాలతో పాటు ఉపాధ్యాయుల ప్రవర్తన, వారు విద్యార్థులకు అందించే విలువలే నిజమైన విద్యకు పునాదిగా నిలుస్తాయని చెప్పారు. విద్య అసలు లక్ష్యం సమాజం పట్ల బాధ్యత కలిగిన మంచి పౌరులను తయారు చేయడమేనని, సమాజ సంక్షేమం కోసం పనిచేసే యువతను తీర్చిదిద్దడం విద్యా వ్యవస్థ ప్రధాన బాధ్యత అని మోహన్ భగవత్ స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us