
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కార్యకర్త వికాస వర్గ శిక్షణా శిబిరాల ముగింపు సభ నాగపూర్లో అత్యంత వైభవంగా జరిగింది. సంఘ్ శతాబ్ది సంవత్సర మహోత్సవాల నేపథ్యంలో నిర్వహించిన ఈ బహిరంగ సభకు ఆర్ఎస్ఎస్ సరసంఘచాలక్ మోహన్ భగవత్ జీ ముఖ్య వక్తగా హాజరవగా, ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఇరు రంగాల ప్రముఖులు దేశ భవిష్యత్తు, హిందూ సమాజ జాగృతి, ప్రపంచ వేదికపై భారతదేశ పాత్ర గురించి కీలక ప్రసంగం చేశారు.
సంఘ్ శతాబ్ది సంవత్సరంలో మూడింట రెండు వంతుల కాలం పూర్తవుతున్న తరుణంలో ఈ శిక్షణా శిబిరం ముగియడం విశేషమని ఆర్ఎస్ఎస్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనేక సంక్షోభాలకు కేవలం భారతదేశం వద్ద మాత్రమే పరిష్కారం ఉందని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రకృతి సమతుల్యత, ఆర్థిక వృద్ధిని ఒకేసారి ఎలా సమన్వయం చేసుకోవాలో తెలియక ప్రపంచం సతమతమవుతోందని, అందరినీ కలుపుకుపోయే దార్శనికత కలిగిన భారతదేశం వైపే జగత్తు చూస్తోందని ఆర్ఆర్ఎస్ చీఫ్ అన్నారు.
వెయ్యి సంవత్సరాల బానిసత్వాన్ని ప్రస్తావిస్తూ.. “మనల్ని పాలించిన సుదూర దేశాల వారు సంఖ్యలోనూ, సంస్కృతిలోనూ మనకంటే అధమమైనవారు. కానీ మన సొంత సంస్కృతిని, సంసిద్ధతను మనం విస్మరించడం వల్లే పరాధీనతను అనుభవించాల్సి వచ్చింది. ఇప్పుడు హిందూ సమాజం తనను తాను సంఘటితం చేసుకుంటూ, జాగృతమవుతోంది” అని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. సార్వత్రిక సోదరభావం, ‘వసుధైక కుటుంబం’ అనే పునాదులపై బలమైన భారతదేశాన్ని నిర్మించడమే సంఘ్ లక్ష్యమని, ప్రతి దేశంలోని ప్రజలు మాకు ఆర్ఎస్ఎస్ అవసరం అనుకునేలా మన కార్యపద్ధతి ఉండాలని పిలుపునిచ్చారు. కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోకుండా సంఘ్ శాఖ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సమాజానికి ఆయన విజ్ఞప్తి చేశారు.
Rss Workers Training Camp Closing Ceremony
దేశ నిర్మాణంలో ఆర్ఎస్ఎస్ పాత్ర అపూర్వం: కుమార్ మంగళం బిర్లా
ముఖ్య అతిథిగా కుమార్ మంగళం బిర్లా హాజరై కీలక ప్రసంం చేశారు. దేశవ్యాప్తంగా 83,000 శాఖలు, 60 లక్షల మంది స్వచ్ఛంద సేవకులు, 1,77,000 సేవా కార్యక్రమాలతో ఆర్ఎస్ఎస్ సాగిస్తున్న కృషి అపూర్వమైనదని ఆయన కొనియాడారు. స్వాతంత్ర్యానికి పూర్వం నాటి నుండి నేటి వరకు భూకంపాలు, సునామీలు వంటి అనేక జాతీయ విపత్తుల సమయంలో సంఘ్ అండగా నిలిచిందని ఆయన గుర్తు చేశారు.
ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వేగంగా దూసుకుపోతోందని, రాబోయే అమృత కాలం దేశాన్ని సరికొత్త శిఖరాలకు చేరుస్తుందని బిర్లా ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదిత్య బిర్లా గ్రూప్ ఆశయాలకు, ఆర్ఎస్ఎస్ సేవా కార్యక్రమాలకు మధ్య విద్యా, వైద్య, సామాజిక అభ్యున్నతి విషయాల్లో ఎంతో పోలిక ఉందని చెప్పారు. స్వయం సమృద్ధి (ఆత్మనిర్భరత) అనేది కేవలం ఆర్థిక విధానం కాదు, అది ఒక దేశ నిర్మాణ ప్రక్రియ అని పేర్కొంటూ.. ‘భారతదేశంలోనే తయారు చేయండి (Make in Bharat), విశ్వం కోసం సృష్టించండి’ అని దేశ యువతకు ఆయన పిలుపునిచ్చారు. సరసంఘచాలక్ మోహన్ భగవత్ నిరాడంబరత, వినయం, దేశం పట్ల ఆయనకున్న అంకితభావం తనను ఎల్లప్పుడూ ప్రేరేపిస్తాయని బిర్లా కొనియాడారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…