RG Kar rape-murder: కోల్‌కతా డాక్టర్‌ హత్యాచార కేసులో నిందితుడికి జీవితఖైదు

ఆర్జీకర్‌ ఆస్పత్రి వైద్యురాలిపై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌ను కోల్‌కతా కోర్టు దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. తాజాగా అతడికి శిక్ష విధించింది. 31 ఏళ్ల వైద్యురాలి మృతదేహాన్ని గత ఏడాది ఆగస్టు 10న ఆసుపత్రి సమావేశ గదిలో గుర్తించిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన 162 రోజుల తర్వాత కోర్టు నిందితుడ్ని దోషిగా నిర్ధారిస్తూ తీర్పు ఇచ్చింది.

RG Kar rape-murder: కోల్‌కతా డాక్టర్‌ హత్యాచార కేసులో నిందితుడికి జీవితఖైదు
Sanjay Roy

Updated on: Jan 20, 2025 | 3:17 PM

దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన ఆర్జీకర్‌ ఆస్పత్రి ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో కోల్‌కతాలోని సీల్దా కోర్టు జనవరి 18, శనివారం తీర్పు వెలువరించింది. నిందితుడు సంజయ్ రాయ్‌ను దోషిగా నిర్ధారించింది. తాజాగా జనవరి 20, సోమవారం అతడికి శిక్ష ఖరారు చేసింది.  నిందితుడికి జీవితఖైదు(మరణించే వరకు జైల్లోనే) విధించింది. 50,000 జరిమానా కూడా వేస్తూ సీల్దా కోర్టు తీర్పునిచ్చింది. ఇక బాధితురాలి కుటుంబానికి రూ.17 లక్షల పరిహారం ఇవ్వాలని.. పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని సీల్దా కోర్టు ఆదేశించింది.

 

గత ఏడాది ఆగస్ట్‌9వ తేదీన కోల్‌కతా ఆర్‌జీకర్‌ ఆస్పత్రిలో దారుణం జరిగింది. జూనియర్‌ డాక్టర్‌పై దారుణంగా అత్యాచారం చేసి చంపేశాడు ఉన్మాది సంజయ్‌రాయ్‌.. ఆగస్ట్‌ 10వ తేదీన సంజయ్‌రాయ్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగింది. నవంబర్ 12న కోర్టు విచారణ ప్రారంభమైంది. పలుమార్లు ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత సీల్దా కోర్టు అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్..  జనవరి 18న సంజయ్ రాయ్‌ను దోషిగా తేల్చుతూ తీర్పును వెల్లడించారు.  BNS 64 సెక్షన్‌తో అత్యాచారం కేసు , BNS సెక్షన్‌ 66 కింద అత్యాచారంతో చనిపోవడానికి కారకుడయ్యాడని కేసు, BNS 103(1) సెక్షన్‌తో హత్య కేసు కింద సంజయ్‌రాయ్‌ను దోషిగా నిర్ధారించింది కోర్టు.. నేరం జరిగిన 162 రోజుల తర్వాత ఈ కేసులో తీర్పు వచ్చింది.

కోర్టులో వాదనలు సందర్భంగా నిందితుడికి ఉరి శిక్ష విధించాలని CBI వాదించింది.  భారత్ న్యాయ సంహిత సెక్షన్ 64, 66, 103(1) ప్రకారం దోషిగా తేలిన సంజయ్‌రాయ్‌కి ఉరే సరని వెర్షన్ వినిపించింది.  అటు.. ఈ కేసులో తీర్పునకు ముందు సంజయ్‌రాయ్‌ తన వాదన చెప్పుకున్నాడు. విచారణ సమయంలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని కోర్టుకు చెప్పాడు. ఎలాంటి కారణం లేకుండా తనపై అభియోగాలు మోపారని, బలవంతంగా పేపర్లపై సంతకాలు చేయించుకున్నారని అన్నాడు. తాను రుద్రాక్షమాల ధరిస్తానని చెప్పాడు.. తాను తప్పు చేసి ఉంటే, రుద్రాక్ష పూసలు తెగిపోయి ఉండాలని కానీ అలా జరగలేదని అన్నాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని సంజయ్‌ రాయ్‌ బుకాయించాడు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి.. దోషికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.