Rajya Sabha Election Results 2022: రాజ్యసభ ఎన్నికల ఫలితాలు విడుదల.. పూర్తి వివరాలు ఇవే..

Rajya Sabha Election Results 2022: శుక్రవారం రాత్రి నాటికి రాజస్థాన్, కర్ణాటకలో మాత్రమే రాజ్యసభ ఎన్నికల ఫలితాలు రాగా.. శనివారం ఉదయం నాటికి 16 రాజ్యసభ స్థానాలకు ఫలితాలు వెలువడ్డాయి.

Rajya Sabha Election Results 2022: రాజ్యసభ ఎన్నికల ఫలితాలు విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
Parliament

Updated on: Jun 11, 2022 | 8:24 AM

Rajya Sabha Election Results 2022: నాలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయించింది. రాజస్థాన్, హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటకలోని పదహారు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో విజయం కోసం కేంద్రంలోని బీజేపీ సహా.. కాంగ్రెస్ పలు విపక్ష పార్టీలు పోటీపడ్డాయి. అయితే.. ఎన్నికలకు వెళ్లే సీట్ల కంటే.. అభ్యర్థుల సంఖ్య పెరగడంతో రాజ్యసభ ఎన్నికలు అనివార్యమయ్యాయి. చివరకు క్యాంప్ రాజకీయాల మధ్య శుక్రవారం పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం వీడియో రికార్డింగ్‌తో పాటు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకులను నియమించింది. శుక్రవారం రాత్రి నాటికి రాజస్థాన్, కర్ణాటకలో మాత్రమే ఫలితాలు రాగా.. శనివారం ఉదయం నాటికి 16 రాజ్యసభ స్థానాలకు ఫలితాలు వెలువడ్డాయి.

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ మూడు స్థానాల్లో గెలుపొందగా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. బీజేపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి సుభాష్‌చంద్ర ఓటమి పాలయ్యారు. కర్ణాటకలో బీజేపీ మూడు స్థానాల్లో గెలుపొందగా.. కాంగ్రెస్ రెండు స్థానాల్లో విజయం సాధించింది. శనివారం తెల్లవారుజామున హర్యానా, మహారాష్ట్రల్లో ఫలితాలు వెలువడ్డాయి. హర్యానాలో బీజేపీ, కాంగ్రెస్ చెరొకటి గెలుపొందాయి. అయితే.. బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలుపొందారు. మహారాష్ట్రలోని ఆరు స్థానాల్లో బీజేపీ, అధికార మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి చెరో మూడింటిని గెలుచుకున్నాయి.

ఇవి కూడా చదవండి

అశ్విని వైష్ణవ్.. ట్విట్

కాగా.. మహారాష్ట్రలో బీజేపీ 3 స్థానాలను కైవసం చేసుకోవడంపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సంతోషం వ్యక్తంచేశారు. బీజేపీపై మరోసారి మహారాష్ట్ర నమ్మకం చూపించిందంటూ ట్విట్ చేశారు.

రాష్ట్రాల వారీగా గెలిచిన, ఓటమి పాలైన అభ్యర్థుల వివరాలు..

రాజస్థాన్..

కాంగ్రెస్ నుంచి ముకుల్ వాస్నిక్, రణదీప్ సూర్జేవాలా, ప్రమోద్ తివారీ గెలుపొందారు. బీజేపీ నుంచి ఘనశ్యామ్ తివారీ గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థి సుభాష్ చంద్ర ఓటమిపాలయ్యారు.

కర్ణాటక

బీజేపీ నుంచి నిర్మలా సీతారామన్, జగ్గేష్, లహర్ సింగ్ విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి జైరాం రమేష్ గెలిచారు. కాగా.. కాంగ్రెస్ నుంచి పోటీచేసిన మన్సూర్ అలీ ఖాన్, జేడీఎస్ నుంచి బరిలో నిలిచిన డి కుపేంద్ర రెడ్డి ఓటమిపాలయ్యారు.

మహారాష్ట్ర

బీజేపీ నుంచి పీయూష్ గోయల్, అనిల్ బోండే, ధనంజయ్ మహాదిక్ గెలుపొందారు. కాగా.. మహా వికాస్ అఘాడీ నుంచి ప్రఫుల్ పటేల్ (NCP) సంజయ్ రౌత్ (శివసేన), ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి (కాంగ్రెస్) గెలుపొందారు. కాగా.. శివసేన నుంచి పోటీచేసిన మరో అభ్యర్థి సంజయ్ పవార్ ఓటమిపాలయ్యారు.

హర్యానా

బీజేపీ నుంచి క్రిషన్ లాల్ పన్వార్, స్వతంత్ర అభ్యర్థి కార్తికేయ శర్మ విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి పోటీచేసిన అజయ్ మాకెన్ ఓటమి పాలయ్యారు.

కాగా.. ఈ ఎన్నికల్లో పలు చోట్ల క్రాస్ ఓటింగ్ జరగడం.. పలు పార్టీల్లో కలకలం రేపింది. రాష్ట్రపతి ఎన్నికలకు ముందు.. రాజ్యసభ ఎన్నికలు జరగడంతో అన్ని పార్టీలు సవాలుగా తీసుకున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..