Bharat Jodo Yatra: రాహుల్ యాత్ర విపక్షాల ఐక్యత కోసం కాదు.. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

|

Sep 16, 2022 | 1:10 PM

కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర కేరళలో కొనసాగుతోంది. సెప్టెంబర్ 7వ తేదీన కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర..

Bharat Jodo Yatra: రాహుల్ యాత్ర విపక్షాల ఐక్యత కోసం కాదు.. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
Rahul
Follow us on

Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర కేరళలో కొనసాగుతోంది. సెప్టెంబర్ 7వ తేదీన కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర 150 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. గురువారం పాదయాత్రకు విరామం ఇచ్చారు. ఒకరోజు విరామం తరువాత శుక్రవారం ఉదయం కేరళలోని కొల్లాం నుంచి ‘భారత్ జోడో యాత్ర’ ను కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, వందలాది మంది కార్యకర్తలతో పునః ప్రారంభించారు. కొల్లాం జిల్లాలోని పోలయథోడు నుండి శుక్రవారం ఉదయం పాదయాత్రను ప్రారంభించిన రాహుల్ గాంధీ 13కిలోమీటర్ల మేర యాత్ర చేయనున్నారు. నీందకర వద్ద సాయంత్రం యాత్ర ముగుస్తుంది. ఈసందర్భంగా జీడిపప్పు కార్మికులు, పారిశ్రామికవేత్తలు, కాంగ్రెస్ మిత్రపక్ష నాయకులతో సమావేశం అవుతారు. రాహుల్ గాంధీ వెంట పాదయాత్రలో కేరళ శాసనసభలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ సీనియర్ నేతలు రమేశ్ చెన్నితల, కే.మురళీధరన్, ఆర్‌ఎస్పీ నేత ఎన్‌కే ప్రేమచంద్రన్ తదితరులు ఉన్నారు.

రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 17వ తేదీ శనివారం కేరళలోని అలప్పులాలోకి ప్రవేశించి సెప్టెంబర్ 21, 22 తేదీల్లో ఎర్నాకులం జిల్లా గుండా వెళ్లి సెప్టెంబర్ 23న త్రిసూర్ చేరుకుంటుంది. సెప్టెంబర్ 26, 27 తేదీల్లో పాలక్కాడ్ మీదుగా సెప్టెంబర్ 28న మలప్పురంలోకి ప్రవేశిస్తుంది. వారం రోజుల పాటు యాత్ర చేసిన తర్వాత 23వ తేదీన ఒకరోజు విరామం తీసుకుంటారు. కాగా కేరళలో భారత్ జోడో యాత్ర కొనసాగుతున్న వేళ అక్కడి అధికార సీపీఏం పార్టీ ఈయాత్రపై విమర్శలు చేసింది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ స్పందించారు. తమది యూరప్ జోడో యాత్ర కాదని.. భారత్ జోడో యాత్ర అని చెప్పారు. CPI(M) బీజేపీ ‘ఏ’ టీమ్‌గా పనిచేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకు సీపీఎం 1989లో బీజేపీతో పొత్తు పెట్టుకుందని గుర్తుచేశారు. భారత్ జోడో యాత్ర విపక్షాల ఐక్యత కోసం కాదని, కాంగ్రెస్‌ను బలోపేతం చేయడం కోసం మాత్రమేనని చెప్పారు. కాంగ్రెస్ లేకుండా ప్రతిపక్షాల ఐక్యత ఉండబోదని జైరాం రమేష్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..