దేశ రాజధానిలో ఉగ్రరూపం దాల్చుతున్న రైతుల ఆందోళన.. ఇవాళ సద్భావన దివస్ పాటించాలని నిర్ణయం

|

Jan 30, 2021 | 8:23 AM

దేశవ్యాప్తంగా రైతు ఉద్యమం తీవ్రమవుతోంది. బీకేయూ ప్రతినిధి రాకేష్‌ తికాయత్‌ ఉద్వేగ ప్రసంగంతో ఉవ్వెత్తున ఎగసిపడుతోంది రైతు ఉద్యమం.

దేశ రాజధానిలో ఉగ్రరూపం దాల్చుతున్న రైతుల ఆందోళన.. ఇవాళ సద్భావన దివస్ పాటించాలని నిర్ణయం
Dehi farmers protest
Follow us on

Delhi farmers Protest : రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతు సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ సద్భావన దివస్ పాటించాలని నిర్ణయించారు. మరోవైపు రైతుల ఆందోళనకు మద్దతుగా యూపీలోని ముజఫర్‌నగర్‌లో ప్రత్యేక సమావేశం జరిగింది. యూపీకి చెందిన రైతులు ఢిల్లీకి తరలివచ్చి ఆందోళనకు మద్దతు పలకాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. కాగా, సింఘు బార్డర్ వద్ద జరిగిన అల్లర్ల ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఎస్‌హెచ్‌ఓపై కత్తితో దాడి చేసిన రంజీత్ సింగ్‌తో పాటు మరో 44 మందిని అదుపలోకి తీసుకున్నారు.

దేశవ్యాప్తంగా రైతు ఉద్యమం తీవ్రమవుతోంది. బీకేయూ ప్రతినిధి రాకేష్‌ తికాయత్‌ ఉద్వేగ ప్రసంగంతో ఉవ్వెత్తున ఎగసిపడుతోంది రైతు ఉద్యమం. ఒక్కరు కాదు..ఇద్దరు కాదు..మళ్లీ సరిహద్దులకు వేలాదిగా తరలివస్తున్నారు అన్నదాతలు. ఉద్యమాన్ని విచ్చిన్నం చేసే కుట్ర జరుగుతోందని, తమ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ రెండో దశ పోరాటం చేపట్టాలని రైతు సంఘాలు డిసైడ్ అయ్యాయి. యూపీ, హర్యానా రాష్ట్రాల నుంచి పోటెత్తారు. ఒక్కటేంటి మీరట్‌, బిజ్నోర్, బాగ్‌పట్‌, ముజఫర్‌నగర్‌, మొరాదాబాద్‌, బులంద్‌షహర్‌ ఇలా అన్ని జిల్లాల నుంచి ఘాజీపూర్‌ చేరుకుంటున్నారు వేలాదిమంది అన్నదాతలు. నిన్న మొన్నటి వరకు 2 వేలుగా ఉన్న రైతన్నలు..ఇవాళ 20వేల మందికి పైగా చేరింది.

ఘాజీపూర్‌ సరిహద్దుల్లో స్థానికులకు, అన్నదాతలకు మధ్య ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. దీంతో అక్కడి నుంచి వెళ్లి పోవాలంటూ రైతులపై ఒత్తిడి పెంచారు పోలీసులు. రెండు నెలలుగా ఆందోళన చేస్తున్న రైతులను ఖాళీ చేయించాలని చూశారు. కానీ ఖాకీల ప్రయత్నం వృథా అయింది. మీ తూటాలకు భయపడేది లేదంటూ తెగేసి చెప్పారు రాకేష్‌ తికాయత్‌. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని కన్నీటి పర్యంతమయ్యారు.

అయితే, రాకేష్‌ తికాయత్‌పై తప్పుడు కేసులు పెట్టారని.. ఆయన్ను దేశద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఆయనకు మద్దతుగా పోరాటం చేయాలని నిర్ణయించిన రైతు సంఘాలు.. సరిహద్దులను ఖాళీ చేసే ప్రసక్తే లేదంటున్నారు. వేలాదిగా కదం తొక్కుతున్న అన్నదాతలతో సింఘు , ఘాజీపూర్‌ , టిక్రీ సరిహద్దుల్లో హైటెన్షన్‌ వాతావరణం కన్పిస్తోంది.

ఇక, ఇవాళ గాంధీ వర్థంతి సందర్భంగా..సద్భావనా దివస్‌ను పాటించాలని నిర్ణయించారు రైతులు. సాయంత్రం 5 గంటల వరకు ఢిల్లీ సరిహద్దుల్లో నిరాహార దీక్షకు దిగారు. మరోవైపు, హర్యానాలో ఇంటర్‌నెట్‌ సేవలు బంద్‌ చేశారు. సోషల్‌ మీడియాలో పుకార్లు కంట్రోల్‌ చేసేందుకు ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేసింది రాష్ట్ర ప్రభుత్వం.

ఇదీ చదవండిః మిక్సోపతికి వ్యతిరేకంగా ఆందోళన బాటపట్టిన వైద్యులు.. ఫిబ్రవరి 1 నుండి ఐఎంఏ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు