
భారత రాజకీయ చరిత్రలో జూన్ 10 సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజుగా నిలవనుంది. దేశాన్ని అత్యంత సుదీర్ఘకాలం, ఎలాంటి విరామం లేకుండా పరిపాలించిన ప్రధానిగా నరేంద్ర మోదీ సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. ఇప్పటివరకు స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న దశాబ్దాల రికార్డును ప్రధాని మోదీ బద్దలగొట్టనున్నారు. దేశంలో మొదటి సాధారణ ఎన్నికలు 1951-52లో జరిగాయి. ఆ ఎన్నికల అనంతరం తొలిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానిగా నెహ్రూ మే 13, 1952న ప్రమాణ స్వీకారం చేశారు. నాటి నుండి మే 27, 1964న ఆయన మరణించే వరకు.. మొత్తం 4,398 రోజుల పాటు ఎలాంటి విరామం లేకుండా నెహ్రూ ప్రధానిగా కొనసాగారు.
మరోవైపు, మే 26, 2014న తొలిసారిగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ, ఈ ఏడాది జూన్ 10 నాటికి విరామం లేకుండా 4,399 రోజులు పూర్తి చేసుకోనున్నారు. దీనితో నెహ్రూ రికార్డును ఒక్క రోజు తేడాతో అధిగమించి, దేశంలోనే సుదీర్ఘకాలం నిరంతరాయంగా పాలించిన ఏకైక ప్రజాస్వామ్య అధినేతగా మోదీ నిలవనున్నారు. కాగా నెహ్రూ కూతురు ఇందిరా గాంధీ జనవరి 24, 1966 నుండి మార్చి 24, 1977 వరకు వరుసగా 4,077 రోజుల పాటు ప్రధానిగా సేవలందించారు.
నెహ్రూ, మోదీ.. ఇద్దరూ భారతీయ రాజకీయాలను దశాబ్దాల పాటు శాసించినవారే అయినప్పటికీ వారి వ్యక్తిగత ప్రస్థానాలు, రాజకీయ నమ్మకాలు మాత్రం పూర్తిగా భిన్నమైనవి.
నెహ్రూ శకం: కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించిన నెహ్రూకు ఆ కాలంలో పెద్దగా జాతీయ స్థాయి ప్రతిపక్షం ఎదురుకాలేదు. ఆయన సెక్యులర్ ఐక్యత సిద్ధాంతంతో దేశాన్ని నడిపించారు.
మోదీ శకం: తీవ్రమైన రాజకీయ పోటీ, ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం ఉన్న తరుణంలో మోదీ ఎదిగారు. గుజరాత్ సిఎంగా వరుసగా మూడుసార్లు గెలిచి, 2014లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏను ఓడించి బీజేపీకి స్పష్టమైన మెజారిటీ తెచ్చిపెట్టారు. మోదీ తన అభివృద్ధి మంత్రం, హిందుత్వ సాంస్కృతిక జాతీయవాదంతో భారత రాజకీయాల వ్యాకరణాన్నే మార్చేశారు.
ప్రధాని మోదీ మొదటి నుండి నెహ్రూ విధానాలపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. చారిత్రక ఆధారాల ప్రకారం.. నాటి 15 రాష్ట్ర కమిటీలలో 12 కమిటీలు సర్దార్ వల్లభాయ్ పటేల్ను మొదటి ప్రధానిగా ప్రతిపాదించాయని, కానీ మహాత్మా గాంధీ ఒత్తిడి వల్లే పటేల్ వెనక్కి తగ్గి డిప్యూటీ పీఎంగా మిగిలిపోవాల్సి వచ్చిందని మోదీ తరచూ వాదిస్తుంటారు. నెహ్రూది బలవంతపు ఎంపిక అని బీజేపీ శ్రేణులు గట్టిగా నమ్ముతాయి.
నెహ్రూ హయాంలోని లౌకికవాద చట్రంలో ఊహించని ఎన్నో సంచలన నిర్ణయాలు మోదీ హయాంలో సాధ్యమయ్యాయి.
ఇలాంటి చారిత్రాత్మక మార్పులు మోదీ హయాంలోనే సాధ్యపడ్డాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి జూన్ 10న ప్రధాని మోదీ సాధించబోయే ఈ చారిత్రక మైలురాయి దేశ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపనుంది.