PM Modi: దక్షిణాదిపై ప్రధాని మోదీ స్పెషల్ ఫోకస్.. పోటీ చేసేది ఇక్కడి నుంచే..? బీజేపీ నయా మాస్టర్ ప్లాన్..
ఈసారి ప్రధాని మోదీ కూడా ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారు. ఉత్తరాది పార్టీ అనే ముద్ర చేరపడానికో, 400 ప్లస్ సీట్లు గెలవడానికో, లేదా నార్త్లో సీట్లు తగ్గితే సౌత్లో కవర్ చేసుకునేందుకో. కారణమేదైనా ఈసారి దక్షిణాది నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు ప్రధాని మోదీ. ఇంతకీ, ఐదు రాష్ట్రాల్లో ఎక్కడ నిలబడతారు? ఎక్కడ ఎక్కువ స్కోప్ ఉంది?

బహుశా అందరికీ గుర్తుండే ఉంటుంది.. పార్లమెంట్ కొత్త భవనంలో ప్రధాని మోదీ ఓ రాజదండాన్ని పట్టుకొచ్చి పెట్టారు. అది చోళరాజ వంశీయుల చరిత్రకు అద్దం పట్టే రాజదండం. వారణాసిలో తమిళ-కాశీ సంఘం ఉత్సవాలు జరిగాయి. మామూలుగా కాదు.. నెల రోజులపాటు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని. వారణాసి.. ప్రస్తుతం ప్రధాని మోదీ నియోజకవర్గం. మొన్నామధ్య తమిళనాడులో పర్యటించిన హోంమంత్రి అమిత్ షా.. ఓ కీలక వ్యాఖ్య చేశారు. ఏదో ఒక రోజు భారత ప్రధానిగా తమిళుడిని చూడాలని ఉందని కామెంట్ చేశారు. ఇవన్నీ ఏం చెబుతున్నాయి? ఏ సిగ్నల్స్ పంపుతున్నాయి? వీటన్నింటిని డీకోడ్ చేస్తే తేలేది ఒక్కేట. ఈసారి దక్షిణాది నుంచి ప్రధాని మోదీ పోటీ చేయాలనుకుంటున్నారని. దక్షిణాదిపై, అందులోనూ తమిళనాడుపై ప్రధాని మోదీ ఫోకస్ ఇప్పటిది కాదు.. కొన్నాళ్ల నుంచే ఉందని ఈ చర్యలన్నీ చెబుతున్నాయి. అంటే, చాలా ప్లాన్డ్గా తమిళనాడుకు సంబంధించిన వ్యవహారాలు చేస్తూ వస్తోంది బీజేపీ. ఈమధ్య తమిళనాడుకు ఎక్కువగా వస్తున్న ప్రధాని.. వీలైనప్పుడల్లా తమిళంలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. పైగా తమిళ ప్రధాని అనే అమిత్షా మాటలకు మరో అర్థాన్ని వెతుకుతున్నారు. మోదీ ఈసారి తమిళనాడు నుంచి పోటీ చేయబోతున్నారని, అక్కడ ఎంపీగా గెలిస్తే తమిళనాడు ఎంపీనే పీఎం అయినట్టు, తమిళుడే ప్రధాని అయ్యారనే ఫీలింగ్ ఉంటుందని చెబుతున్నారు. ఈ యాంగిల్ అసలు ఎవరూ ఊహించనిది కూడా.
బీజేపీ అంటే ఉత్తరాది పార్టీ అనే ముద్ర పడిపోయింది. మొన్నటి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ అదే తేలింది. అందుకే, దక్షిణాది నుంచి పోటీ చేయాలనే ప్రతిపాదనకు ఆర్ఎస్ఎస్ కూడా అంగీకరించినట్టు చెబుతున్నారు. అందుకు తమిళనాడునే ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది. సరే.. తమిళనాడు నుంచే పోటీ చేయాలనుకుంటే ఏ నియోజకవర్గం ఎంచుకుంటారు? రామేశ్వర క్షేత్రం ఉన్న రామనాథపురం నుంచి లోక్సభకు పోటీచేయొచ్చనేది బీజేపీలో జరుగుతున్న ప్రచారం. ఇప్పటికే, కాశీ ఎంపీగా ఉన్నారు. కాశీ-రామేశ్వరం మధ్య ఎలాంటి బాండింగ్ ఉంటుందో అందరికీ తెలుసు. అందుకే, ఈ నియోజకవర్గం ఎంచుకోబోతున్నారని చెబుతున్నారు. పైగా రామేశ్వరం నుంచి పోటీ చేస్తే బీజేపీకి మంచి జోష్ వస్తుంది. కాశీ-రామేశ్వరం, రాముడి సెంటిమెంట్ బాగా పనిచేస్తుంది. పైగా దక్షిణాదిన ఈ ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుందంటున్నారు. అయితే, రామనాథపురంలో ముస్లింలు ఎక్కువగా ఉంటారు. బీజేపీ అంతర్గతంగా చేసిన ఓ సర్వేలో.. రామనాథపురంలో బీజేపీకి ఆశించిన స్థాయిలో బలం లేదని తేలింది. మరీ ముఖ్యంగా బూత్ లెవెల్ నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీకి లీడర్షిప్ లేకపోవడం అతిపెద్ద సమస్యగా చెబుతున్నారు. పైగా రామనాథపురం నుంచి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీకి చెందిన నేత ఎంపీగా ఉన్నారు. ఈ పార్టీకి డీఎంకే సపోర్ట్ చేస్తోంది. సో, రామనాథపురం అంత ఈజీ కాదన్న ప్రచారం జరుగుతోంది.
రామేశ్వరం కాకపోయినా.. తమిళనాడులోనే మోదీకి మరో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కన్యాకుమారి, మరొకటి కోయంబత్తూర్. ఆల్రడీ.. కన్యాకుమారి ఎంపీ పొన్ రాధాకృష్ణన్, కోయంబత్తూర్ ఎంపీ సీపీ రాధాకృష్ణన్ బీజేపీ నుంచి గెలిచిన ఎంపీలే. 2019 ఎన్నికల్లో ఈ రెండు స్థానాలను గెలిచింది బీజేపీ. దీంతో ఈ రెండిట్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తే.. కచ్చితంగా గెలుస్తారనే రిపోర్ట్స్ అందాయి. దక్షిణాది అంటే తమిళనాడు ఒక్కటే కాదు.. మొత్తం ఐదు రాష్ట్రాలు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, కేరళ కూడా ఉన్నాయి. తెలంగాణలో మోదీ పోటీ చేస్తే.. గెలవగలిగే స్థానాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా మల్కాజిగిరి, మహబూబ్నగర్ లాంటి స్థానాలున్నాయి. అయితే, ఈ లిస్టులో కేంద్రమంత్రి కిషన్రెడ్డి నియోజకవర్గం సికింద్రాబాద్ కూడా వినిపిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే విశాఖపట్నం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తే మోదీ గెలుపు ఖాయమే. కాకపోతే, పోటీ చేసేందుకు మరిన్ని ఆప్షన్స్ వెతుకుతున్నారు. కర్నాటకలో బీజేపీకి బలం ఉంది. ఈమధ్య జేడీఎస్తోనూ పొత్తు పెట్టుకుంది. కాకపోతే, గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత కర్నాటక నుంచి పోటీ చేయాలన్న ప్లాన్ మారిందని చెబుతున్నారు. ఇక మిగిలింది కేరళ మాత్రమే. బీజేపీ చేసిన సర్వేల్లో కేరళలో పోటీ అంత ఈజీ కాదని తేలింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటకలో గెలుపు సాధ్యమైనంత తేలిగ్గా కేరళలో ఉండదని చెబుతున్నారు. అందుకే, కేరళను ఇప్పుడప్పుడే టచ్ చేయకపోవచ్చంటున్నారు.
అసలు ప్రధాని మోదీ దక్షిణాది నుంచి పోటీ ఎందుకు? సింపుల్.. వచ్చే ఎన్నికల్లో 400 ప్లస్ సీట్లు సాధించాలనుకుంటోంది బీజేపీ. ఇది సాధ్యం కావాలంటే దక్షిణాదిన ఎక్కువ సీట్లు గెలవాల్సిందే. పైగా సౌత్లో బీజేపీ చాలా బలహీనంగా కనిపిస్తోంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీలదే బలం. కర్నాటకలో కాంగ్రెస్, కేరళలో లెఫ్ట్ బలంగా ఉన్నాయి. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్కు బలం ఎక్కువే. అంటే.. ఐదు రాష్ట్రాల్లో ఏ ఒక్క స్టేట్లోనూ పట్టు చిక్కడం లేదు బీజేపీకి. అందుకే, ఈసారి దక్షిణాది నుంచే కనీసం వంద సీట్లు గెలవాలనే ప్లాన్లో ఉంది. ఒకవేళ, ఉత్తరాదిన సీట్లు తగ్గినా.. వాటిని సౌత్ స్టేట్స్ నుంచి కవర్ చేసుకోవచ్చనేది మరో ప్లాన్. 2019 ఎన్నికల్లో బీజేపీ గెలిచిన 303 సీట్లలో.. దక్షిణాది నుంచి ఉన్నవి కేవలం 29 సీట్లు మాత్రమే.
కర్నాటక తప్ప ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదు. పైగా బీజేపీకి మిత్రులు దూరం అవుతున్నారు. ఎన్డీయే కూటమి నుంచి అన్నాడీఎంకే వెళ్లిపోయింది. అందుకే, తెలంగాణ, కేరళ, లేదా తమిళనాడులో పోటీకి ప్రయత్నిస్తున్నారు ప్రధాని మోదీ. బీజేపీ టెంపుల్ పాలిటిక్స్ కూడా ఇందులో భాగమేనంటున్నారు. అయోధ్య రామాలయంతో ఓ ఇమేజ్ బిల్డప్ చేయాలనుకుంటున్నారు. పైగా రామేశ్వరానికి రాముడికి ఉన్న బంధం యుగాల నాటిది. దాన్నే ఓట్లుగా మలుచుకోవాలనుకుంటోంది బీజేపీ. అటు కేరళలో శబరిమల భక్తులకు సౌకర్యాలు కల్పించకపోవడాన్ని కూడా బీజేపీనే హైలెట్ చేస్తోంది.
సౌత్లో నేరుగా ప్రధాని మోదీ పోటీ చేస్తే.. ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏమాత్రం ఓటింగ్ శాతం లేని తమిళనాడు లాంటి రాష్ట్రాల నుంచి పోటీ చేస్తే.. మొత్తం దక్షిణాదిలోనే బీజేపీకి ఊపు తీసుకురావచ్చన్నది ప్లాన్. మరి ఈ ప్రణాళిక ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..