Vice President: ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడి చమత్కారాలే విజయసూత్రాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉపరాష్ట్రపతి ప్రశంసల వర్షం కురిపించారు. ఉపరాష్ట్రపతిగా ఈనెల 10వ తేదీతో వెంకయ్యనాయుడి పదవీకాలం పూర్తిచేసుకోనున్న నేపథ్యంలో రాజ్యసభలో ఈరోజు నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ..ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెంకయ్యనాయుడు ఎంతో ప్రజాదరణ కలిగిన నాయకుడని.. ఎన్నో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని ప్రశంసించారు. ఆయన తన పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారంటూ భావోద్వేగానికి గురయ్యారు. వెంకయ్యనాయుడితో కలిసి పనిచేసే అదృష్టం తనకు లభించిందన్నారు. ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా. సభా నాయకుడిగా అనేక బాధ్యతలను నిష్టతో సమర్థంగా నిర్వహించారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఏ పదవిలో ఉన్నా అంకితభావంతో పనిచేస్తూ అందరి మన్ననలు పొందడం వెంకయ్యనాయుడి సొంతమని పేర్కొన్నారు. పనిపట్ల ఆయన చూపే శ్రద్ధ ఎందరికో ఆదర్శనీయమని ప్రశంసించారు.
వెంకయ్యనాయుడు తన ప్రసంగంలో ఉపయోగించే చమత్కారాలు హృదయాల్లో హత్తుకుంటాయన్నారు. ఆయన ఏం మాట్లాడినా అందులో భావం ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. వెంకయ్యనాయుడు చెప్పే మాటలను ఎవరూ కౌంటర్ చేయరని.. ఇటువంటి నాయకులు అరుదుగా ఉంటారని తెలిపారు. భారతీయ భాషలపై వెంకయ్యనాయుడికి ఎంతో పట్టుందని ప్రశంసించారు. తాను రాజకీయాల నుంచి వైదొలిగినా.. ప్రజా జీవితం నుంచి అలసిపోనంటూ వెంకయ్యనాయుడు ఎప్పుడూ చెప్పే వ్యాఖ్యలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజ్యసభలో గుర్తు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగిస్తున్న సమయంలో వెంకయ్యనాయుడు భావోద్వేగానికి గురయ్యారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..