
దేశ అత్యున్నత చట్టసభ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ఆగస్టు 13 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు లోక్సభ సచివాలయం అజెండాను ఖరారు చేసింది. సమావేశాల్లో భాగంగా కేంద్రప్రభుత్వం పలు కీలక చట్టాలను చేయనుంది. జాతీయ గౌరవానికి అవమానాల నివారణ (సవరణ) బిల్లు, 2026.. వందేమాతరం ,జనగణమన పడుతున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా అవమానించడం లేదా అంతరాయం కలిగించడాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణించేలా ఈ బిల్లును రూపొందించారు.
విదేశీ విరాళాల నియంత్రణ (FCRA) సవరణ బిల్లు, 2026 విదేశీ నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ఈ సవరణను తీసుకురానున్నారు. జనన మరణాల నమోదు (సవరణ) బిల్లు, 2026 ఆలస్యంగా చేసే రిజిస్ట్రేషన్ల నిబంధనలను మరింత కఠినతరం చేయడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశ్యం. వీటితో పాటు విక్షిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు-2025, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు (33 నుంచి 37కి) బిల్లు, ఆదాయపు పన్ను సవరణ బిల్లు, మరియు ఎంఎస్ఎంఈ (MSME) రంగ అభివృద్ధికి సంబంధించిన సవరణ బిల్లులను సభ ముందు ఉంచనున్నారు.
రాజ్యాంగ సవరణ బిల్లులపై ఉత్కంఠ
పార్లమెంట్ సభ్యులకు పంపిణీ చేసిన ప్రాథమిక అజెండాలో 130వ , 131వ రాజ్యాంగ సవరణ బిల్లులు లేనప్పటికీ, వాటి ప్రస్తావన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వీటిని బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC)లో చర్చించి నిర్ణయం తీసుకుంటారా, లేదా నేరుగా సభలో ప్రవేశపెడతారా అనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది..సమావేశాల నిర్వహణలో భాగంగా ఎంపీల కోసం లోక్సభ సచివాలయం కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది. సభలోకి స్మార్ట్ వాచీలు, స్మార్ట్ కళ్లద్దాలు, పెన్ కెమెరాల వంటి నిఘా పరికరాలను అనుమతించరు. అలాగే, పార్లమెంట్ ఆవరణలో ధర్నాలు, రాజకీయ నిరసనలకు పూర్తి నిషేధం విధించినట్లు అధికారులు పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.