హిందూ దేవుళ్లు, దేవతలు బ్రాహ్మణులు కారు.. JNU వీసీ వివాదాస్పద వ్యాఖ్యలు

'ఎవరో గుర్తుతెలియని వాళ్లు సృష్టించిన కులాన్ని కాపాడటం కోసం ఎవరినైనా చంపేందుకు సిద్ధంగా ఉన్నారు. వివక్షాపూరితమైన, అసమానమైన కుల గుర్తింపు కోసం ఎందుకు పాకులాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు'

హిందూ దేవుళ్లు, దేవతలు బ్రాహ్మణులు కారు.. JNU వీసీ వివాదాస్పద వ్యాఖ్యలు
Santishree Dhulipudi Pandit

Edited By: Janardhan Veluru

Updated on: Aug 23, 2022 | 2:59 PM

Hindu Gods do not come from upper caste: హిందూ దేవుళ్లు బ్రాహ్మణ కులానికి చెందిన వాళ్లు కారని JNU వైస్ ఛాన్సలర్‌ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్‌ సోమవారం (ఆగస్ట్‌ 22) తన ప్రసంగంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ ‘Dr B.R. Ambedkar’s Thought on Gender Justice: Decoding the Uniform Civil Code’ అనే టాపిక్‌పై సెమినార్‌ నిర్వహించింది. ఈ టాపిక్‌పై వీసీ శాంతిశ్రీ మాట్లాడుతూ.. ‘ఆంత్రోపాలజీ పరంగా, శాస్త్రీయ పరంగా మన దేవుళ్ల మూలాలు పరిశీలిస్తే ఏ దేవుడు కూడా బ్రాహ్మణుడు కాదు. వాళ్లందరూ క్షత్రియులు. శివుడు ఖచ్చితంగా షెడ్యూల్డ్ కులం లేదా షెడ్యూల్డ్ తెగలకు చెందినవాడై ఉండాలి. పామును ధరించి, చాలా తక్కువ వస్త్రాలతో శ్మశానవాటికలో ధ్యాన ముద్రలో కూర్చున్నాడు. బ్రాహ్మణులు శ్మశానాల్లో కూర్చుంటారని నేననుకోవడం లేదు. కాబట్టి ఆంత్రోపాలజీ ప్రకారం లక్ష్మి దేవి, ఆది పరాశక్తితో సహా దేవతలు, దేవుళ్లందరూ అగ్రవర్ణాల నుంచి వచ్చినట్లు రుజువులు లేవు. హిందూ దేవుడైన జగన్నాథ స్వామిని తీసుకుంటే అతనొక గిరిజనుడు. కాబట్టి దేవుళ్లందరూ బ్రాహ్మణులనే వివక్షను కొనసాగించడం అర్థంలేనిదే అవుతుందని’ జేఎన్‌యూ వీసీ అన్నారు.

‘మనుస్మృతి’ ప్రకారం.. మహిళలందరూ ‘శూద్రులు’గా వర్గీకరించబడ్డారు. దీనిని బట్టి ఏ మహిళ కూడా బ్రాహ్మణ కులం లేదా ఇతర కులాలకు చెందిన వారు కాకూడదు. వివాహం ద్వారా మాత్రమే భర్త లేదా తండ్రి కులాలను స్త్రీ పొందుతుందని నేను భావిస్తున్నాను. ఇది ఖచ్చితంగా మహిళలను తిరోగమనం వైపు నెట్టడమే అవుతుంది.

Jnu Vc

కులం అనేది పుట్టుకపై ఆధారపడి లేదని చెప్పేవారు చాలా ఉంది ఉన్నా.. దురదృష్టవశాత్తూ నేడు అది పుట్టుకపై ఆధారపడి ఉందని వాదించేవాళ్లు ఎక్కువయ్యారు. బ్రాహ్మణుడు లేదా ఇతర కులాలకు చెందిన వాడు చెప్పులు కుట్టినంత మాత్రాన వాడు దళితుడు అవుతాడా? కానేకాడు.. ఎందుకు చెబుతున్నానంటే ఇటీవల రాజస్థాన్‌లో మూడో తరగతి చదివే తొమ్మిదేళ్ల దళిత విద్యార్ధిని కేవలం అగ్రవర్ణాల వాళ్లు తాగే నీళ్లను ముట్టాడనే కారణం చేత స్కూల్‌ ఉపాధ్యాయుడు కొట్టి చంపాడు. కనీసం ఆ నీళ్లను తాగనైనా లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇది మానవ హక్కులకు సంబంధించిన ప్రశ్న. ఈ విధమైన పద్ధతులతో తోటి మనిషులతో మనం ఏ విధంగా మెలగగలం? అని ఆమె ప్రశ్నించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ ‘కుల నిర్మూలన’ గురించి ప్రస్తావిస్తూ.. ‘మన దేశ సామాజిక వ్యవస్థ బాగుపడాలంటే కుల నిర్మూలన చేయడం చాలా అవసరం. ఇటువంటి వివక్షాపూరితమైన, అసమానమైన కుల గుర్తింపు కోసం ఎందుకు పాకులాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఎవరో గుర్తుతెలియని వాళ్లు సృష్టించిన కులాన్ని కాపాడటం కోసం ఎవరినైనా చంపేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

ఇవి కూడా చదవండి

కులం, లింగం విభజన గురించి ఆమె ఈ విధంగా మాట్లాడారు.. ‘మీరు ఒక మహిళ అయ్యి ఉండి, రిజర్వ్‌డ్ వర్గాలకు చెందినవారైతే రెట్టింపు అట్టడుగున ఉన్నారని గుర్తుంచుకోండి. మొదటిగా స్త్రీ అయినందుకు, రెండు అన్ని రకాల మూస పద్ధతులను తూచ తప్పకుడా పాటించే సోకాల్డ్ కులం నుంచి వచ్చినందుకు రెండింతలు అట్టడుతున ఉన్నట్లు గ్రహించండి. మన దేశంలోని అన్ని మతాలలో బౌద్ధమతం చాలా గొప్పది. వైవిధ్యాలు, వ్యత్యాసాలు దీనిలో ఉండవని ‘Indic civilisation’ రుజువు చేస్తోంది. గౌతమ బుద్ధుడు బ్రాహ్మణీయ హిందూవాదాన్ని (Brahminical Hinduism) తీవ్రంగా వ్యతిరేకించాడు. చరిత్రలో మొట్టమొదటి హేతువాది బుద్ధుడేనని’ వైస్ ఛాన్సలర్‌ శాంతిశ్రీ తన ప్రసంగంలో తెలిపారు. తెలుగు, తమిళం, మరాఠీ, హిందీ, సంస్కృతం, ఇంగ్లీష్ భాషల్లో ప్రవీణ్యమున్న శాంతిశ్రీ గతంలో సావిత్రి ఫూలే పూణే యూనివర్సిటీలో పాలిటిక్స్‌ అండ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జేఎన్‌టీయూ తొలి మహిళా వీసీగా నియమితులయ్యారు.

మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి