National Herald case: ఈ వీడియో చూశారా.. పోలీసుల‌పై ఉమ్మేసిన మ‌హిళా కాంగ్రెస్ అధ్య‌క్షురాలు..

Netta D'souza: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో రాహుల్‌గాంధీని ఈడీ ఐదోసారి విచారించింది. ఈడీ తీరును నిరసిస్తూ ఢిల్లీలో కాంగ్రెస్‌ చేపట్టిన ఆందోళన రణరంగంగా మారింది. కాంగ్రెస్‌ కార్యకర్తలకు , పోలీసులకు ఘర్షణ జరిగింది.

National Herald case: ఈ వీడియో చూశారా.. పోలీసుల‌పై ఉమ్మేసిన మ‌హిళా కాంగ్రెస్ అధ్య‌క్షురాలు..
Netta D'souza

Updated on: Jun 21, 2022 | 9:11 PM

ఢిల్లీలో రాహుల్‌గాంధీ ఈడీ విచారణకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఆందోళనల్లో షాకింగ్‌ పరిణామం చోటు చేసుకుంది. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌ రాజ్‌భవన్‌ దగ్గర జరిగిన ఘటన ఢిల్లీలో రిపీట్‌ అయ్యింది. పోలీసులపై చెయ్యి చేసుకున్నారు మహిళా కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ నిట్టా డిసౌజా. ఓ పోలీసు కానిస్టేబుల్‌పై ఆమె ఉమ్మేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పలు చోట్ల కాంగ్రెస్‌ కార్యకర్తలకు – పోలీసులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. అయితే పోలీసులు తనను కొట్టారని ఆరోపించారు నిట్టా డిసౌజా. తాను చేసిన పనిని పూర్తిగా సమర్ధించుకున్నారు. ఢిల్లీ పోలీసులు మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తలతో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు.
రాహుల్‌గాంధీ ఈడీ విచారణను నిరసిస్తూ ఢిల్లీలో కాంగ్రెస్‌ ఎంపీలు , నేతలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఏఐసీసీ కార్యాలయం నుంచి జంతర్‌మంతర్‌ వరకు కాంగ్రెస్‌ చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో జరిగిన తోపులాటలో కాంగ్రెస్‌ నేతలు కిందపడిపోయారు. పోలీసులతో గొడవకు దిగారు కాంగ్రెస్‌ నేత అల్కా లాంబా. తనపై పోలీసులు చెయ్యి చేసుకున్నారని ఆమె రోడ్డు మీదే కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు ఆమెను బలవంతంగా వ్యాన్‌లో ఎక్కించారు.

కాంగ్రెస్‌ అగ్రనేతలను కూడా ఢిల్లీ పోలీసులు ఈడ్చుకెళ్లారు. అధిర్‌రంజన్‌తో పాటు కాంగ్రెస్‌ ఎంపీలను అరెస్ట్‌ చేశారు. పోలీసుల తీరుపై కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో రాహుల్‌గాంధీని ఐదోసారి ప్రశ్నించింది ఈడీ. అయితే కేంద్రం ఒత్తిడితో రాహుల్‌ను ఈడీ అధికారులు ప్రశ్నల పేరుతో వేధిస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్‌ నేతలు.

ఇవి కూడా చదవండి


ఈడీ తీరుపై ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని కాంగ్రెస్‌ శ్రేణులు నిర్ణయించాయి. ఎంపీలంతా ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీకి చేరుకోవాలని ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తోంది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఈనెల 23వ తేదీన విచారణకు హాజరుకావాలని సోనియాగాంధీకి కూడా ఈడీ సమన్లు జారీ చేసింది.

జాతీయ వార్తల కోసం

Loading...
Unable to load recommendations.
Follow Us