NDRF First Women’s Team: దేశంలో ఎక్కడ ఏ ఆపద వచ్చినా.. ఎవరికి ఏ సహాయం అవసరమైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా తమ ప్రాణాలను లెక్కచేయకూండా సహాయం చేయడానికి ముందు ఉండేవారు రెస్క్యూటీమ్. అయితే ఇప్పటి వరకూ ఈ పనిని పురుషులే చేస్తున్నారు. అయితే తాము ఏ విషయంలోనూ తక్కువ కాదంటూ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి మహిళలు కూడా రంగంలోకి దిగారు. ఇప్పటి వరకూ పురుషులకే పరిమితమైన జాతీయ విపత్తు సహాయక దళంలోకి మహిళలు అడుగు పెట్టారు. ఎన్డిఆర్ఎఫ్ లోకి ఇటీవలే 100 మందికి పైగా మహిళలు రక్షణ సిబ్బందిగా నియమితులయ్యారు. దీంతో అధికారికంగా ‘జాతీయ విపత్తు రక్షణ దళం’లోకి మహిళల చరిత్రాత్మక రంగ ప్రవేశం చేశారు.
తొలిసారి శిక్షణ పొంది వచ్చిన ఈ వంద మంది మహిళా బృందాన్ని ఉత్తర్ ప్రదేశ్లోని గఢ్ ముక్తేశ్వర్ పట్టణంలో గంగా నదీ తీరాన సహాయక చర్యల కోసం నియమించారు. ఈ విషయాన్ని ఎన్డిఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎస్ఎన్ ప్రధాన్ తెలిపారు. ఈ తొలి మహిళా జట్టు ఆపద నుంచి కాపాడే పడవల్ని నడపడం, అవసరమైతే అప్పటికప్పుడు వాటికి మరమ్మతులు చేయడం, ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయినవారిని గాలించి ఆ పడవల్లో ఒడ్డుకు చేర్చడం వంటి విధులను నిర్వహించనున్నారు.
వీళ్లు కాక మరో వందమందికి పైగా మహిళలకు ఎన్.డి.ఆర్.ఎఫ్. డైరెక్టర్ జనరల్ ఎస్.ఎన్.ప్రధాన్ శిక్షణ ఇప్పించబోతున్నారు. ఈ మొత్తం 200 మందీ ఇన్స్పెక్టర్లుగా, సబ్ ఇన్స్పెక్టర్లుగా, కానిస్టేబుళ్లుగా తమ విధులు నిర్వర్తిస్తారని ప్రధాన్ చెప్పారు. ప్రతి 1000 మంది సిబ్బందితో కూడిన ఎన్డిఆర్ఎఫ్ బెటాలియన్లో 108 మంది వరకు మహిళా సహాయకులు ఉండవచ్చని ఆయన వివరించారు.
Also Read: వెండి తెరపై అడుగు పెట్టనున్న అతిలోక సుందరి శ్రీదేవి మరో వారసురాలు