Udupi: కొత్తగా నిర్మించిన రహదారికి గాడ్సే పేరు.. సైన్‌బోర్డు కలకలం, కేసు న‌మోదు చేసిన పోలీసులు

|

Jun 06, 2022 | 6:41 PM

ఉడిపి జిల్లాలోని ఓ వీధికి నాథూరామ్ గాడ్సే పేరు పెట్టడంపై వివాదం చెలరేగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఈ బోర్డు తీవ్ర కలకలం రేపింది. అదే సమయంలో..

Udupi: కొత్తగా నిర్మించిన రహదారికి గాడ్సే పేరు.. సైన్‌బోర్డు కలకలం, కేసు న‌మోదు చేసిన పోలీసులు
Godse
Follow us on

కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని ఓ వీధికి నాథూరామ్ గాడ్సే పేరు పెట్టడంపై వివాదం చెలరేగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఈ బోర్డు తీవ్ర కలకలం రేపింది. అదే సమయంలో కాంగ్రెస్‌ నేతల తరఫు నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. ఇదిలా ఉంటే, నాథూరాం గాడ్సే పేరు మీద ఎప్పుడు, ఎవరు సైన్ బోర్డు పెట్టారో గ్రామ పంచాయతీకి తెలియడం లేదని పంచాయతీ అభివృద్ధి అధికారి (పీడీవో) తెలిపారు. ఉడిపి జిల్లాలోని బోలా గ్రామ పంచాయితీకి వెళ్లే రహదారిపై ‘నాథూరామ్ గాడ్సే రాస్తా’ అనే సూచిక బోర్డు పెట్టారు. సోమవారం ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన గ్రామ పంచాయతీ అధికారులు పోలీసుల సమక్షంలో రోడ్డుపై ఉన్న బోర్డును తొలగించారు. బోర్డు పెట్టిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సైన్‌బోర్డ్ ఫోటో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల‌వుతోంది.

సోమవారం ఉదయం రోడ్డుపై నాథూరామ్ గాడ్సే పేరుతో బోర్డులు ఉన్నట్లు సమాచారం అందిందని బోలా గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారులు తెలిపారు. గ్రామపంచాయతీకి సైన్‌బోర్డ్ ఎప్పుడు, ఎవరు ఏర్పాటు చేశారో తెలియదని అన్నారు. గ్రామపంచాయతీ తరపున, ఈ రహదారికి గాడ్సే పేరు పెట్టాలని గ్రామ పంచాయతీ ఎటువంటి ప్రతిపాదన చేయలేదని చెప్పారు. ఫిర్యాదు మేరకు గ్రామపంచాయతీ శాఖ వారు అక్కడికక్కడే కర్కల రూరల్ పోలీసుల సమక్షంలో సైన్ బోర్డును తొలగించారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు పీడీఓ తెలిపారు. అదే సమయంలో కర్కల తాలూకా పంచాయతీ ద్వారా పదుగిరి గ్రామానికి వెళ్లేందుకు కొంతకాలం క్రితం రోడ్డు వేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ రహదారిపై సూచిక బోర్డు కనీసం రెండు రోజుల క్రితమే పెట్టినట్టుగా తెసింది.

ఇవి కూడా చదవండి

ఇకపోతే, క‌ర్నాట‌క ఇంధ‌న శాఖ మంత్రి వి సునీల్ కుమార్ నియోజ‌క‌వ‌ర్గంలోని బోలో గ్రామ పంచాయితీలో ఈ సైన్ బోర్డు ఏర్పాటైంది.ఈ బోర్డును ప్రభుత్వం, గ్రామ పంచాయితీ అధికారులు ఏర్పాటు చేయ‌లేద‌ని, ఇది కొంద‌రి దుండగుల ప‌ని అని మంత్రి పేర్కొన్నారు. రెండు రోజుల కింద‌ట తాము ఈ బోర్డును గుర్తించి పంచాయితీ అధికారులు, పోలీసుల‌కు ఫిర్యాదు చేశామ‌ని క‌ర్నాట‌క యూత్ కాంగ్రెస్ చీఫ్ యోగేష్ ఇన తెలిపారు. కొందరు దుండగులు కావాలనే వివాదం రేపేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడి ఉంటారని, వారిపై క‌ఠిన చ‌ర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.