
ఈ నెల చివర్లో మలేషియాలో జరిగే ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సమావేశం జరిగే అవకాశం ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) శుక్రవారం తెలిపింది. ఈ శిఖరాగ్ర సమావేశం అక్టోబర్ 26-28 మధ్య మలేషియాలోని కౌలాలంపూర్లో జరుగుతుంది.
ఒక ప్రెస్ మీట్లో MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ASEAN శిఖరాగ్ర సమావేశం జరగడానికి ఇంకా సమయం ఉందని, సంబంధిత సమాచారాన్ని సరైన సమయంలో పంచుకుంటామని, ఇద్దరు నాయకుల(ట్రంప్, మోదీ) మధ్య సమావేశం జరగవచ్చని సూచించారు. అలా జరిగితే అమెరికా అధ్యక్షుడు భారత దిగుమతులపై అదనపు సుంకాలను విధించిన తర్వాత ప్రధాని మోదీ, ట్రంప్ మధ్య జరిగిన మొదటి సమావేశం ఇదే అవుతుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్టోబర్ 26 నుండి 28 వరకు కౌలాలంపూర్లో జరిగే ఆసియాన్, తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాలకు హాజరవుతారని మలేషియా భారత్కు తెలియజేసింది. ప్రధానమంత్రి మోదీ పర్యటనకు సంబంధించి అధికారిక ప్రకటన లేనప్పటికీ, సన్నాహాలు జరుగుతున్నాయి. ట్రంప్ ప్రయాణంపై అమెరికా కూడా వైట్ హౌస్ లేదా విదేశాంగ శాఖ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల రాలేదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి