Ajit Pawar Death: విమాన ప్రమాదంలో అజిత్‌ పవార్‌ దుర్మరణం.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్ ప్రాణాలు కోల్పోవడంతో రాజకీయ వర్గాల్లో విషాదం నెలకుంది. అజిత్‌ పవార్ మృతి అత్యంత షాకింగ్‌గా ఉందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రజల నాయకుడిగా ఆయన సేవలను గుర్తు చేస్తూ కుటుంబానికి సంతాపం తెలిపారు.

Ajit Pawar Death: విమాన ప్రమాదంలో అజిత్‌ పవార్‌ దుర్మరణం.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
Ajit Pawar With PM Modi

Updated on: Jan 28, 2026 | 10:58 AM

మహారాష్ట్రలో చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్‌ పవార్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. బారామతి వద్ద ల్యాండ్ అవుతున్న సమయంలో విమానం కుప్పకూలగా, అజిత్‌ పవార్‌తో పాటు మరో నలుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో ప్రధాని మోదీ, అమిత్‌ షా ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలు, పరిస్థితులపై ఆరా తీశారు.

అజిత్‌ పవార్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగ ట్వీట్ చేశారు. అజిత్‌ పవార్ ప్రజల నాయకుడిగా, గ్రాస్‌రూట్‌ స్థాయి వరకు బలమైన అనుబంధం కలిగిన వ్యక్తిగా పేరొందారని ప్రధాని గుర్తు చేశారు. మహారాష్ట్ర ప్రజల సేవలో అహర్నిశలు శ్రమించిన కష్టజీవిగా ఆయనకు విశేష గౌరవం ఉందని పేర్కొన్నారు. పాలనా వ్యవహారాలపై ఆయనకు ఉన్న అవగాహన, పేదలు.. అణగారిన వర్గాలను శక్తివంతం చేయాలన్న తపన విశేషమని మోదీ ట్వీట్‌లో తెలిపారు. అజిత్‌ పవార్ అకస్మాత్తుగా కన్నుమూయడం అత్యంత షాక్‌కు గురిచేసిందని, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన సానుభూతిని తెలియజేశారు.

ఈ ప్రమాదంతో మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నేతలు, ప్రజలు అజిత్‌ పవార్‌కు నివాళులు అర్పిస్తున్నారు.