
మధ్యప్రదేశ్లో ఒకే కుటుంబంలో జరిగిన రెండు మరణాలు తీవ్ర కలకలం రేపాయి. మొదట భార్య అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించగా, ఆ తర్వాత పరారీలో ఉన్న భర్త కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ దారుణం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. జబల్పూర్లో జరిగిన జరిగిన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
న్యూ కంచన్పూర్ ప్రాంతంలోని ఒక అద్దె ఇల్లు రెండు రోజులుగా మూసి ఉంది. లోపలి నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా, వంటగదిలో 35 ఏళ్ల నేహా సింగ్ మృతదేహం బాగా కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైంది. ఆమె మెడకు స్కార్ఫ్ చుట్టి ఉండటంతో పోలీసులు దీనిని హత్యగా అనుమానించి ఎఫ్ఎస్ఎల్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దించారు.
మృతురాలు నేహా సింగ్కు ఇది రెండో వివాహం. మొదటి భర్త మరణించిన తర్వాత, రెండేళ్ల క్రితం కట్నీ జిల్లాకు చెందిన మయాంక్ సింగ్ను ఆమె పెళ్లాడింది. తన 8 ఏళ్ల కుమారుడితో కలిసి వీరు న్యూ కంచన్పూర్లో నివసిస్తున్నారు. అయితే, జనవరి 2025లో విజయ్నగర్లోని ఒక స్పా సెంటర్పై పోలీసులు జరిపిన దాడిలో నేహా పేరు బయటపడటంతో దంపతుల మధ్య వివాదాలు తీవ్రమయ్యాయి.
ఈ కేసులో వారి ఎనిమిదేళ్ల కుమారుడి వాంగ్మూలం అత్యంత కీలకంగా మారింది. ఘటనకు ముందు తల్లిదండ్రులు తీవ్రంగా గొడవ పడ్డారని ఆ బాలుడు తెలిపాడు. రెండు రోజులుగా అమ్మను చూడనివ్వకుండా, ఆమె బయటకు వెళ్లిందని తండ్రి పదేపదే అబద్ధం చెప్పినట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు.
భార్య మరణం తర్వాత మయాంక్ సింగ్ పరారయ్యాడు. పోలీసులు అతని కోసం గాలిస్తుండగా, శోభాపూర్ అండర్బ్రిడ్జ్ సమీపంలోని పాడుబడిన ఒక శిథిలంలో మయాంక్ ఉరితాడుకు వేలాడుతూ శవమై కనిపించాడు. భార్యను హతమార్చిన తర్వాతే అతను భయంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. “ప్రాథమిక విచారణ ప్రకారం కుటుంబ కలహాలే ఈ ఘోరానికి కారణం. రెండు మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తి చేశాం. ఫోరెన్సిక్ నివేదికలు, ఎలక్ట్రానిక్ ఆధారాల ద్వారా పూర్తి నిజాలు సేకరిస్తున్నాం.” అని అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) *జితేంద్ర సింగ్ తెలిపారు.
ఈ క్షణికావేశం, కుటుంబ కలహాల కారణంగా జరిగిన విషాదంలో ఎనిమిదేళ్ల చిన్నారి ఒకేసారి తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయి అనాథగా మిగలడం స్థానికులను తీవ్రంగా కలచివేస్తోంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..