
మాజీ కేంద్ర మంత్రి ఎంజె అక్బర్ పాకిస్థాన్ నిజస్వరూపాన్ని బయటపెట్టే ప్రయత్నం చేశారు. విదేశాలకు వెళ్లిన ఎంపీల బృందంలో.. బీజేపీ ఎంపి రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందంలో భాగమైన ఆయన డెన్మార్క్లో మాట్లాడుతూ పాకిస్థాన్ పరువుతీశారు. ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి యూరప్ కూడా చూసిన క్రూరమైన, అనాగరికమైన మత ఉగ్రవాదం అని అక్బర్ అన్నారు. పాకిస్తాన్ ద్వంద్వ వైఖరిని అక్బర్ ఎండగట్టారు. పాకిస్థాన్ రెండు ఫేస్లు కలిగి ఉందని, ఆ దేశ ప్రభుత్వానికి రెండు నాలుకలు ఉన్నాయని తాము చర్చల కోసం ఎవరితో మాట్లాడాలని అక్బర్ ప్రశ్నించారు. ఒక వైపు చర్చలంటూనే, మరోవైపు ఉగ్రవాదం కొనసాగిస్తున్న పాకిస్థాన్తో చర్చలు కేవలం బుద్దిహీనమే అని అన్నారు.
బిజెపి ఎంపి రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని అఖిలపక్ష పార్లమెంటరీ ప్రతినిధి బృందం శుక్రవారం డెన్మార్క్ చేరుకుంది. కోపెన్హాగన్లోని భారత రాయబారి మనీష్ ప్రభాత్ ప్రతినిధి బృందాన్ని స్వాగతించారు. ఎంపీలు దగ్గుబాటి పురందేశ్వరి, ఎంజే అక్బర్, గులాం అలీ ఖతానా, సమిక్ భట్టాచార్య ఈ బృందంలో ఉన్నారు. కాంగ్రెస్ ఎంపీ నుంచి అమర్ సింగ్, శివసేన (యూబీటీ) నుంచి ప్రియాంక చతుర్వేది, మాజీ దౌత్యవేత్త పంకజ్ సరన్ కూడా ఇందులో ఉన్నారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిపై ఇండియా ప్రతిస్పందన, సరిహద్దు ఉగ్రవాదంపై దాని విస్తృత పోరాటం గురించి అంతర్జాతీయ భాగస్వాములకు వివరించడం ఈ ప్రతినిధి బృందం అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే. ఫ్రాన్స్, యూకే, జర్మనీ, ఈయూ, ఇటలీ, డెన్మార్క్ దేశాల నాయకులతో ఈ బృందం చర్చలు జరపనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..