కరోనాను జయించా.. కేరళ నర్సు భావోద్వేగం

| Edited By: Anil kumar poka

Apr 05, 2020 | 4:34 PM

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఓ సాధారణ నర్సు విజయవంతంగా తిప్పి కొట్టి దానిపై విజయం సాధించింది. ఈ రోగం సోకిన ఈమె పూర్తిగా కోలుకుంది. ఆమె పేరే రేష్మా మోహనదాస్. వయస్సు 32 ఏళ్ళు.

కరోనాను జయించా.. కేరళ నర్సు భావోద్వేగం
Follow us on

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఓ సాధారణ నర్సు విజయవంతంగా తిప్పి కొట్టి దానిపై విజయం సాధించింది. ఈ రోగం సోకిన ఈమె పూర్తిగా కోలుకుంది. ఆమె పేరే రేష్మా మోహనదాస్. వయస్సు 32 ఏళ్ళు. కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందినది. ఈమె చరిత్ర సాధారణమైనదేమీ కాదు. కొట్టాయం జిల్లాలోని ఆసుపత్రిలో.. ఇండియాలోనే అతి వృధ్ద జంటకు కరోనా సోకగా.. వారికి వైద్య చికిత్సలు చేస్తూ.. ఈ  రోగాన్ని తనకూ అంటించుకుంది. అహర్నిశలూ వారి బాగోగులు చూస్తుండడంతో ఈమెకు కూడా కరోనా సోకింది. పేషంట్లయిన 93 ఏళ్ళ థామస్ అబ్రహాం, అతని భార్య 88 ఏళ్ళ మరియమ్మలను తన కన్నతలిదండ్రులకన్నా ఎక్కువగా చూసుకుంటూ, ఐసీయూలో వైద్య  సేవలోనే గడుపుతూ వచ్చింది. కంటికి రెప్పలా వారిని రేష్మ కాపాడింది. దీంతో ఆ వృధ్ద జంట పూర్తిగా ఆరోగ్య వంతులై ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అయితే కరోనా సోకిన రేష్మా అదే ఆసుపత్రిలో క్వారంటైన్ లో ఉండక తప్పలేదు. కానీ కేరళ హెల్త్ కేర్ పుణ్యమా అని ఈ వ్యాధి బారి నుంచి పూర్తిగా బయటపడింది. ‘కరోనానుంచి కోలుకున్నానని, దాన్ని జయించానని, వారం రోజుల్లోగా ఈ గది నుంచి వచ్చేస్తానని’ తన ఫ్రెండ్స్ కి,  తన సహచరులకు వాట్సాప్ మెసేజెస్ పంపింది ఈ నర్సు.

కేరళ హెల్త్ కేర్ లో నాకు ఎంతో విశ్వాసం ఉంది.. ఇది వరల్డ్ క్లాస్ హెల్త్ కేర్ అంటూ రేష్మ ప్రశంసలు గుప్పించింది. ఇక 14 రోజులపాటు ఇంటిలోనే స్వీయ నియంత్రణలో ఉండి.. మళ్ళీ ఈ ఆసుపత్రికి వఛ్చి నర్సుగా తన విధులను నిర్వరిస్తానని, కరోనా రోగులకు సేవ చేస్తానని రేష్మ అంటోంది. ఈమె మనోధైర్యాన్ని కొనియాడని వాళ్ళు లేరు.. కాగా-థామస్ అబ్రహాం, అతని భార్య మరియమ్మకు ఇటలీ నుంచి తిరిగి వఛ్చిన వీరి కొడుకు, కోడలు, చిన్నారి మనవడి ద్వారా కరోనా సోకింది. అయితే అందరూ ఈ రోగం నుంచి కోలుకుని విముక్తులయ్యారు.ఇప్పుడు అంతా ఫుల్ హ్యాపీ !