
కర్ణాటకలోని బీదర్ జిల్లాలో శనివారం (జనవరి 31) పేలుళ్లు తీవ్ర కలకలం రేపాయి. ముగ్గురు చిన్నారులతో సహా 8 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై కర్నాటక ప్రభుత్వం ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. మొలిగే మారయ్య ఆలయానికి వెళ్లే రోడ్డుపై ఈ సంఘటన జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ఘటన ఆ ప్రాంతంలో భయాందోళనలు చెలరేగాయి.
కర్నాటక బీదర్ జిల్లా హుమ్నాబాద్ సమీపం లోని మొల్కేరా గ్రామంలో భారీ పేలుడు జరిగింది. భూమిలో పాతిపెట్టిన వస్తువు పేలడంతో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడ్డవాళ్ల పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. భూమిలో పేలుడు ఎందుకు జరిగిందన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాంబ్ స్క్వాడ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మొలిగి మారయ్య ఆలయం సమీపంలో ఈ పేలుడు జరిగింది. ఆరునెలల్లో ఐదోసారి ఈ ప్రాంతంలో పేలుళ్ల జరగడంతో స్థానికులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పేలుడుపై కర్నాటక ప్రభుత్వం ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. పేలుడు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఫోరెన్సిక్ బృందాలను రప్పించారు. ఈ పేలుడుకు కారణంపై దర్యాప్తు చేస్తున్నారు. కెమికల్స్తో కూడిన డబ్బాలను భూమిలో పాతిపెట్టడంతో ఈ పేలుళ్లు జరిగినట్టు అనుమానిస్తున్నారు.
అయితే ఈ పేలుళ్ల వెనుక కుట్ర కోణం ఉందా ? అన్న విషయంపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన తరువాత మొల్కేరా గ్రామంలో భయాందోళన నెలకొంది. భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనపై కర్నాటక మంత్రి ఈశ్వర్ కాండ్రే దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. అసలు పేలుడు పదార్ధాలకు అక్కడికి ఎవరు తీసుకొచ్చారు ? ఎందుకు తీసుకొచ్చారన్న విషయంపై దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..