Karnataka Elections 2023: కర్నాటకలో ఊపందుకున్న నామినేషన్ల పర్వం.. రంగంలోకి దిగిన హేమా హేమీలు..

కర్నాటక ఎన్నికల్లో ప్రచారం ఉపందుకుంది. పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌ , జేడీఎస్‌ నేతల కుమారస్వామితో పాటు పలువురు నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. మాజీ సీఎం జగదీశ్‌ శెట్టార్‌ చేరికతో తమకు 150కి పైగా సీట్లు వస్తాయని కాంగ్రెస్‌ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే శెట్టార్‌ చేరికతో కాంగ్రెస్‌కు ఉన్న సీట్లే పోతాయనీ బీజేపీ కౌంటరిచ్చింది.

Karnataka Elections 2023: కర్నాటకలో ఊపందుకున్న నామినేషన్ల పర్వం.. రంగంలోకి దిగిన హేమా హేమీలు..
Karnataka Nominations

Updated on: Apr 17, 2023 | 8:43 PM

కర్నాటక ఎన్నికల ప్రచారంలో సవాళ్ల పర్వం మరింత ముదిరింది. హేమాహేమీలు నామినేషన్లు దాఖలు చేశారు. కర్నాటక పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్ కనకపుర నియోజకవర్గంలో నామినేషన్‌ వేశారు. నామినేషన్‌ కంటే ముందు భారీ రోడ్‌షో నిర్వహించారు డీకే శివకుమార్‌ . వేలాదిమంది కార్యకర్తలు రోడ్‌షోలో పాల్గొన్నారు. కర్నాటకలో కాంగ్రెస్‌ అధికారం లోకి వస్తే డీకే శివకుమార్‌కు కచ్చితంగా సీఎం పదవి లభిస్తుందని ఆయన అభిమానులంటున్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘనవిజయం సాధిస్తుందన్నారు డీకే శివకుమార్‌. 150కి పైగా సీట్లలో గెలిచి కాంగ్రెస్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. మాజీ సీఎం జగదీశ్‌ శెట్టార్‌ చేరికతో కాంగ్రెస్‌ మరింత బలోపేతం అయ్యిందన్నారు. చాలామంది బీజేపీ నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్దంగా ఉన్నారని , కాని వాళ్లందరికి టిక్కెట్లు ఇవ్వలేమన్నారు శివకుమార్‌.

అధికార బీజేపీ కూడా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. బెంగళూర్‌లో భారీ రోడ్‌షో నిర్వహించారు మంత్రి అశ్వథనారాయణ . కాంగ్రెస్‌ గెలుస్తుందని ఆ పార్టీ నేతలు పగటికలలు కంటున్నారని అన్నారు మంత్రి అశ్వథ నారాయణ. కాంగ్రెస్‌కు ప్రస్తుతం ఉన్న 79 సీట్లు కూడా రావన్నారు. కచ్చితంగా బీజేపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు.

కుమారస్వామి చెన్నపట్న నియోజకవర్గంలో నామినేషన్‌

జేడీఎస్‌ అధ్యక్షుడు కుమారస్వామి చెన్నపట్న నియోజకవర్గంలో నామినేషన్‌ దాఖలు చేశారు. జేడీఎస్‌ తప్పకుండా గెలుస్తుందని , తమకు జగదీశ్‌ శెట్టార్‌ లాంటి నేత అవసరం లేదన్నారు. కుమారస్వామి తనయుడు నిఖిల్‌ రామనగర నియోజకవర్గం నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు.

బీజేపీ మూడో జాబితా విడుదల

కర్నాటకలో బీజేపీ మూడో జాబితాను విడుదల చేసింది. ఇప్పటివరకు బీజేపీ 222 మంది అభ్యర్ధులను ప్రకటించింది. ఇంకా రెండు సీట్లకు మాత్రమే అభ్యర్ధులను పెండింగ్‌లో పెట్టింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం

Follow Us