జార్ఖండ్లోని గుమ్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కడుపు నొప్పితో బాధపడుతున్న 8వ తరగతి బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ప్రసవించింది. మైనర్ బాలిక ప్రసవించడంలో స్కూల్ యాజమాన్యంతో పాటు, విద్యాశాఖ షాక్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ బాలికల స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినికి ఆదివారం రాత్రి కడుపులో విపరీతమైన నొప్పి వచ్చింది. దాంతో హాస్టల్ సిబ్బంది.. బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అమ్మాయిని పరిశీలించిన వైద్యులు ప్రెగ్నెంట్గా గుర్తించి.. డెలివరీ చేశారు. మైనర్ బాలికకు ఆడబిడ్డ జన్మించింది.
మైనర్ బాలిక ప్రసవించడంతో విద్యాశాఖలో కలకలం రేగింది. అసలేం జరిగిందని ఆరా తీయగా.. విషయం బయటపడింది. కారణం అమ్మాయి బంధువులే అని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అమ్మాయిని స్కూల్లో చేర్పించే సమయానికే గర్భవతి అని విచారణలో తేల్చారు.
బాలిక.. తన ఊర్లో మామ వరుస అయ్యే యువకుడితో ప్రేమాయణం నడిపింది. ఆ విషయంలోనే యువకుడి కుటుంబం, అమ్మాయి కుటుంబం మధ్య పలుమార్లు ఘర్షణలు కూడా జరిగాయి. పంచాయితీ పెట్టి పెద్దల సమక్షంలో అమ్మాయిని ఊరుకి దూరంగా స్కూల్లో చదివించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే.. బాలికను గుమ్లా కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించారు. అయితే, బాలిక అప్పటికే గర్భవతి అని కుటుంబ సభ్యులకు తెలిసినా.. విషయాన్ని స్కూల్ యాజమాన్యానికి తెలుపలేదని విచారణలో తేల్చారు అధికారులు.
ప్రసవించిన బాలిక, ఆమె బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. అయితే, వీరిద్దరినీ ఇప్పుడు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సంరక్షణలో ఉంచారు. ఇక బాలిక చెప్పిన వివరాల ప్రకారం.. గర్భవతిని చేసిన వ్యక్తిపై పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు గుమ్లా పోలీసులు. ప్రస్తుతం సదరు వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతన్ని అదుపులోకి తీసుకుంటామని గుమ్లా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ వినోద్ కుమార్ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..