
సాధారణంగా మనం ఎవరిపైనైనా పోలీసులకు ఫిర్యాదు చేయాలంటే.. నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఫిర్యాదును స్వీకరించిన తర్వాత పోలీసలు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని తెలిసిందే. ప్రాథమిక సమాచారం ఆధారంగా తయారు చేసిన రిపోర్ట్. దాని తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేస్తారు పోలీసులు. అయితే తాజాగా దేశంలోనే తొలి ఈ-ఎఫ్ఐఆర్ నమోదు అయింది. అదే ఎలాక్ట్రానిక్ ఎఫ్ఐఆర్. వాట్సాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదు మేరకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు శనివారం తొలిసారిగా ఎలక్ట్రానిక్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(e-FIR) నమోదు చేశారు. డిజిటల్ పోలీసింగ్లో భాగంగా హంద్వారాలోని విల్గామ్ పోలీస్ స్టేషన్ వాట్సాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదు మేరకు తన మొదటి ఈ-ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
కుప్వారాలోని హంజిపోరా నివాసి, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్గా పనిచేస్తున్న ఇంతియాజ్ అహ్మద్ దార్ ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. దార్ తరత్పోరా నుండి శ్రీనగర్కు ప్రయాణిస్తుండగా విల్గామ్ చేరుకున్న తర్వాత, విల్గామ్లోని షెహ్నిపోరా నివాసితులైన ఆషిక్ హుస్సేన్ భట్, గౌహెర్ అహ్మద్ భట్ అనే ఇద్దరు వ్యక్తులు తనను తప్పుగా నిర్బంధించి తనపై దాడి చేశారని ఇంతియాజ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ విషయాన్ని అతను పోలీసులకు వాట్సాప్ ద్వారా తెలియజేశాడు. వాట్సాప్ ద్వారా వచ్చిన సమాచారంతో విల్గామ్ పోలీసులు BNS(భారతీయ న్యాయ సంహిత) సెక్షన్లు 115(2),126(2) కింద ఈ-ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు.