భారత-చైనా మధ్య ఉద్రిక్తత…ఇక వైమానిక శ్రేణిలోకి రఫేల్ యుధ్ధ విమానాలు

| Edited By: Pardhasaradhi Peri

Jul 20, 2020 | 2:12 PM

చైనాతో తలెత్తిన ఉద్రిక్తత కారణంగా ఇండియా తన వైమానిక సత్తాను మరింత బలోపేతం చేయాలనుకుంటోంది. ఇందులో భాగంగా లడాఖ్ సరిహద్దుల్లో ఇదివరకే ఫైటర్లను, హెలీకాఫ్టర్లను, క్షిపణి వ్యవస్థలను మోహరించింది..

భారత-చైనా మధ్య ఉద్రిక్తత...ఇక వైమానిక శ్రేణిలోకి రఫేల్ యుధ్ధ విమానాలు
Follow us on

చైనాతో తలెత్తిన ఉద్రిక్తత కారణంగా ఇండియా తన వైమానిక సత్తాను మరింత బలోపేతం చేయాలనుకుంటోంది. ఇందులో భాగంగా లడాఖ్ సరిహద్దుల్లో ఇదివరకే ఫైటర్లను, హెలీకాఫ్టర్లను, క్షిపణి వ్యవస్థలను మోహరించింది. అయితే ఇదే సమయంలో అత్యంత ఆధునిక 5 రఫేల్ యుద్ధ విమానాలను వైమానిక దళం ఈ నెల 29 న తన విమాన శ్రేణిలోకి చేర్చనుంది. రెండు సీట్లతో కూడిన మూడు విమానాలు, సింగిల్ సీటుతో ఉన్న రెండు విమానాలు ఆ రోజున అంబాలా ఎయిర్ బేస్ లో దిగనున్నాయి. ఈ ఫ్రెంచ్ ఆరిజిన్ ఫైటర్ల కోసం వైమానిక దళం రోడ్ మ్యాప్ ని కూడా రూపొందించబోతోంది. రఫేల్ విమానాలను ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకునేందుకు భారత ప్రభుత్వం ఇదివరకే ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. 59 వేల కోట్ల విలువైన 30 కి పైగా రఫేల్ ఫైటర్ల ‘రాక’ కోసం ప్రభుత్వం ఆతృతగా ఎదురు చూస్తోంది.

ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్.కె.భదౌరియా ఈ నెల 22-23 తేదీల్లో ఐ ఏ ఎఫ్ కమాండ్ల చీఫ్ లతో కమాండర్ల స్థాయిలో జరిగే కాన్ఫరెన్స్ కి అధ్యక్షత వహించి వారితో చర్చించనున్నారు. లడాఖ్ తూర్పు ప్రాంతంలో భారత-చైనా దళాలు  కొంత వెనక్కి వెళ్లినప్పటికీ..ఇంకా పూర్తి ఉపసంహరణ జరగవలసి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్న మన వైమానిక దళ ‘మోహరింపు’లో రఫేల్ ఫైటర్లు కూడా చేరిన పక్షంలో మనకు తిరుగు ఉండదని ఆయన వ్యాఖ్యానించారు.