సీజ్‌ఫైర్‌ తర్వాత ప్రధాని మోదీ కీలక భేటీ.. రేపటి DGMOల మీటింగ్‌లో పాక్‌పై భారత్‌ విధించే షరతులు ఏంటి?

పహల్గాంలోని ఉగ్రవాద దాడి తరువాత, భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టింది. పాకిస్తాన్ యుద్ధానికి ప్రయత్నించగా, అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే, కాల్పుల విరమణ ఉల్లంఘనల నేపథ్యంలో, ప్రధాని మోదీ రక్షణ అధికారులతో సమావేశమై భవిష్యత్తు వ్యూహం గురించి చర్చించారు.

సీజ్‌ఫైర్‌ తర్వాత ప్రధాని మోదీ కీలక భేటీ.. రేపటి DGMOల మీటింగ్‌లో పాక్‌పై భారత్‌ విధించే షరతులు ఏంటి?
Pm Modi

Updated on: May 11, 2025 | 1:33 PM

మన దేశంపై దాడి చేసి జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మందిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. అలాంటి వారిని ఏరివేసేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టి.. పాకిస్థాన్‌, పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లో దాడులు నిర్వహించి, ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. నా కుటుంబంలో 10 మంది చనిపోయారని ఏకంగా ప్రపంచం మొత్తం ఉగ్రవాదిగా గుర్తించిన హఫీజ్ కూడా ఒప్పుకున్నాడు. అయినా కూడా తమ దేశ పౌరులను చంపేశారంటూ పాకిస్థాన్‌ యుద్ధానికి కాలు దువ్వింది. వారికి భారత సైన్యం ధీటుగా బదులిచ్చింది.

అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడం ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్‌, పాక్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఆ తర్వాత కూడా పాక్‌ మాట తప్పి కాల్పులకు పాల్పడితే భారత్‌ ధీటుగా బదులిచ్చింది. అయితే ఈ నెల 12న అంటే సోమవారం భారత్‌, పాక్‌ అధికారులు సమావేశం అయి దీనిపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలో ఈ కీలక భేటీకి ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, త్రివిధ దళాధిపతులతో సమావేశం నిర్వహించారు. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ నివాసంలో ఈ కీలక భేటీ జరిగింది.

వీరితో ఈ సమావేశంలో CDS అనిల్‌చౌహాన్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ కూడా పాల్గొన్నారు. బోర్డర్‌లో ప్రస్తుత పరిస్థితిపై ప్రధాని మోదీ సమీక్ష చేపట్టారు. రేపటి DGMOల సమావేశంపై కూడా ఈ మీటింగ్‌లో చర్చ జరిగింది. మీటింగ్‌లో పాకిస్థాన్‌పై ఎలాంటి షరతులు విధించాలి, ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఒక వేళ మన షరతులకు పాకిస్థాన్‌ ఒప్పుకోకుంటే ఎలాంటి నిర్ణయాలు వెల్లడించాలనే కీలక అంశాలు ఈ ప్రధాని మోదీ అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..