WAVES 2025: క్రియేటివ్ పవర్‌హౌస్‌గా భారత్.. ముంబై వేదికగా వేవ్స్ సమ్మిట్.. తేదీలను ప్రకటించిన అశ్విని వైష్ణవ్

భారత్‌ను గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సమాయత్తమవుతోంది.. ఇండియా సాఫ్ట్ పవర్‌ను ప్రపంచంలో అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు ఇప్పటికే ప్రణాళికలు రచించింది.. ఇందులో భాగంగా వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌ను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోతోంది.

WAVES 2025: క్రియేటివ్ పవర్‌హౌస్‌గా భారత్.. ముంబై వేదికగా వేవ్స్ సమ్మిట్.. తేదీలను ప్రకటించిన అశ్విని వైష్ణవ్
Waves 2025 Summit

Updated on: Feb 08, 2025 | 9:16 PM

భారత్‌ను గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సమాయత్తమవుతోంది.. ఇండియా సాఫ్ట్ పవర్‌ను ప్రపంచంలో అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు ఇప్పటికే ప్రణాళికలు రచించింది.. ఇందులో భాగంగా వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌ను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోతోంది. ఈ కీలక సమ్మిట్‌కు సంబంధించి ప్రధాని మోదీ భారతదేశంతోపాటు.. ప్రపంచంలోని పలు రంగాల ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. భారతీయ సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖ నటీనటులు, వ్యాపార వేత్తలతో మాట్లాడారు. WAVES (World Audio Visual & Entertainment Summit) సమ్మిట్ అడ్వైజరీ బోర్డు సమావేశంలో సలహాలు సూచనలను అడిగి తెలుసుకున్నారు.

అయితే.. వేవ్స్ సమ్మిట్ 2025 గురించి సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది.. మే 1 నుంచి 4 వరకు వేవ్స్ సమ్మిట్ ను నిర్వహించనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను శనివారం పంచుకున్నారు. మే 1 నుంచి 4వ తేదీ వరకు వేవ్స్ సమ్మిట్ ముంబై వేదికగా జరగనుందని.. ఎక్స్ వేదికగా పలు వివరాలను షేర్ చేశారు అశ్విని వైష్ణవ్..

అశ్విని వైష్ణవ్ ట్వీట్..

ప్రపంచంలోనే సృజనాత్మక శక్తి కేంద్రంగా మారడానికి భారతదేశం పునాది వేస్తోందిని అందుకోసం WAVES సమ్మిట్ 2025 నిర్వహిస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. ‘‘ప్రధానమంత్రితో సలహా బోర్డు స్ఫూర్తిదాయక సమావేశం తర్వాత ప్రధాని మోదీ భారతదేశాన్ని ప్రపంచ కంటెంట్ హబ్‌గా మార్చడానికి మొదటి ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES 2025) ను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.. ఈ సమ్మిట్ ప్రపంచంలోని అగ్రశ్రేణి మీడియా CEOలు, వినోద రంగంలోని అగ్రతారలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సృజనాత్మక కలిగిన ప్రముఖులను ఒకచోట చేర్చుతుంది.. వినోదం, సృజనాత్మకత, సంస్కృతిని మునుపెన్నడూ లేని విధంగా ఏకం చేస్తుంది.. మీ క్యాలెండర్‌లను గుర్తించండి. మీ కలలను సిద్ధం చేసుకోండి.. WAVESలో ప్రయాణించడానికి సిద్ధంగా ఉండండి’’ అంటూ ట్వీట్ చేశారు.

మే 1నుంచి 4వ తేదీ వరకు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో WAVES సమ్మిట్ 2025 జరుగుతుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు.

కాగా.. భారతీయ సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖ నటీనటులు, వ్యాపార వేత్తలతో ప్రధాని మోదీ.. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ అయి.. వేవ్స్ సమ్మిట్ కోసం సలహాలు, సూచనలు తీసుకున్నారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలీవుడ్‌ స్టార్స్‌ అమితాబ్‌ బచ్చన్‌, షారుఖ్‌ఖాన్‌, ఆమిర్‌ఖాన్‌, అనిల్‌ కపూర్‌, మిథున్‌ చక్రవర్తి, అక్షయ్‌కుమార్‌, హేమమాలిని, దీపికా పదుకొణె సమావేశానికి హాజరయ్యారు. దక్షిణాది నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్‌, నాగార్జున, ఎ. ఆర్. రెహమాన్‌లకు అవకాశం దక్కింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us