పాలు, పాల ఉత్పత్తులపై A1, A2 తొలగించండి.. FSSAI ఆదేశాలు. ఎందుకంటే?

| Edited By: Janardhan Veluru

Aug 26, 2024 | 4:16 PM

మార్కెట్లో లభించే పాలు, పాల ఉత్పత్తుల్లో A1 రకం పాల వాటాయే అత్యధికం. విదేశీ జాతులు, హైబ్రీడ్ జాతులకు చెందిన ఆవులు, గేదెలు ఇచ్చే పాలను A1 రకం పాలుగా వర్గీకరిస్తాం. వివిధ సంస్థలు గ్రామాల్లోని రైతులతో పాటు డైరీ ఫాంల నుంచి పాలను సేకరించి మార్కెట్ చేస్తుంటాయి. A2 రకం అంటే పూర్తిగా దేశీయ ఆవులు, గేదెల నుంచి సేకరించే పాలు.

పాలు, పాల ఉత్పత్తులపై A1, A2 తొలగించండి.. FSSAI ఆదేశాలు. ఎందుకంటే?
Representative Image
Follow us on

పేదవాడి నుంచి ధనికుడి వరకు పాలు, పాల ఉత్పత్తులు రోజువారీ ఆహారంలో భాగం. మార్కెట్లో అనేక సంస్థలు పాలను శుద్ధి చేసి, ప్యాకెట్ల రూపంలో మార్కెట్లో పంపిణీ చేస్తున్నాయి. అయితే కోవిడ్-19 అనంతర పరిణామాలు, ప్రజల్లో ఆరోగ్యకర జీవనంపై పెరిగిన మక్కువతో నిత్యం వినియోగించే పాల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీన్ని ఆసరా చేసుకుంటున్న సంస్థలు తమ పాలను మార్కెట్ చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చినవే A1, A2 రకాలు. మార్కెట్లో అత్యధికంగా A1 రకం పాలు లభ్యమవుతుండగా, A2 రకం పాలు చాలా తక్కువ మొత్తంలో లభిస్తాయి. తాజాగా ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాల అధీకృత సంస్థ – (Food Safety and Standards Authority of India – FSSAI) జారీ చేసిన ఆదేశాలు మార్కెట్ వర్గాల్లో కలకలానికి దారితీశాయి. పాలు, పాల ఉత్పత్తులపై A1, A2 అంటూ ముద్రించడం నిలిపివేయాలని FSSAI ఆదేశించింది. ఇంతకీ ఎందుకు ఈ ఆదేశాలు జారీ చేసింది? అసలు A1, A2 రకం అంటే ఏంటి?

దేశీ పాల ఉత్పత్తులే ఆరోగ్యకరం

మార్కెట్లో లభించే పాలు, పాల ఉత్పత్తుల్లో A1 రకం పాల వాటాయే అత్యధికం. విదేశీ జాతులు, హైబ్రీడ్ జాతులకు చెందిన ఆవులు, గేదెలు ఇచ్చే పాలను A1 రకం పాలుగా వర్గీకరిస్తాం. వివిధ సంస్థలు గ్రామాల్లోని రైతులతో పాటు డైరీ ఫాంల నుంచి పాలను సేకరించి మార్కెట్ చేస్తుంటాయి. A2 రకం అంటే పూర్తిగా దేశీయ ఆవులు, గేదెల నుంచి సేకరించే పాలు. ఒక విదేశీ జాతి లేదా హైబ్రీడ్ రకం ఆవు/గేదెతో పోల్చితే దేశీయ ఆవులు, గేదెలు తక్కువ మొత్తంలో పాలను ఇస్తాయి. అందుకే మార్కెట్లో వీటి లభ్యత కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయితే కొన్ని పరిశోధనల్లో దేశీ ఆవులు, గేదెల పాలే ఎక్కువ పోషక విలువలు కలిగి ఉన్నాయని, ఆరోగ్యకరమని తేలింది. దీంతో A2 రకం పాలు, పాల ఉత్పత్తులకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. అప్పటి వరకు అన్ని రకాల పాలను కలిపి సేకరిస్తున్న సంస్థలు, దేశీ జాతి ఆవులు, గేదెల పాలను విడిగా సేకరించడం మొదలుపెట్టాయి. కొన్ని సంస్థలు కేవలం A2 రకం పాలను మాత్రమే సేకరిస్తూ మార్కెట్ చేస్తున్నాయి. ఇలా మొత్తానికి మార్కెట్లో A2 రకం పాలు, పాల ఉత్పత్తులు లభిస్తున్నాయి.

ఇంతకీ అవి నిజంగానే A2 రకం పాల ఉత్పత్తులేనా అన్నది తేల్చాలంటే ఆ పాలను ల్యాబ్‌లో పరీక్షించాల్సి ఉంటుంది. పాలల్లో ఉండే ప్రొటీన్ (బీటా కెసీన్)లో ఉండే తేడాను బట్టి అవి ఏ రకం పాలు అన్నది నిర్థారించవచ్చు.

FSSAI ఆదేశాల వెనుక కారణం ఏంటి?

మార్కెట్లో లభిస్తున్న పాలు, పాల ఉత్పత్తుల నాణ్యతను పరీక్షించి అవి సురక్షితం అని FSSAI సర్టిఫై చేస్తుంది. ఆ మేరకు ఒక ప్రతి సంస్థకు లైసెన్స్ నెంబర్ ఇస్తుంది. అయితే ఆ లైసెన్స్ నెంబర్ ఉపయోగించి A2 రకం పాలు, పాల ఉత్పత్తులను మార్కెట్ చేయడానికి ఆ సంస్థ తప్పుబడుతోంది. తాము నాణ్యతను పరీక్షించి సురక్షితమా కాదా అన్నది మాత్రమే నిర్థారిస్తాం తప్ప అవి ఏ రకం పాలు అన్నది నిర్ధారించి తాము ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వడం లేదని ఆ సంస్థ స్పష్టీకరించింది. అలాంటప్పుడు తమ లైసెన్స్ నెంబర్ ఉపయోగిస్తూ తాము సర్టిఫై చేసినట్టుగా A2 రకం పాలు, పాల ఉత్పత్తుల పేరుతో మార్కెట్ చేయడం వినియోగదారులను తప్పుదారి పట్టించడమేనని అభిప్రాయపడింది. అందుకే పాలు, పాల ఉత్పత్తులైన పెరుగు, నెయ్యి, పనీర్, చీజ్ వంటి ఉత్పత్తుల ప్యాకేజింగ్‌పై A1 , A2 రకం అని ముద్రించడాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. ఇదే సమయంలో ఆయా సంస్థలకు కొంత వెసులుబాటు కూడా కల్పించింది. ఇప్పటికే లేబుళ్లు ముద్రించిన స్టాక్ ఉంటే, వాటిని కొనసాగించవచ్చని, గరిష్టంగా 6 నెలల లోపు ఆ ముద్రించిన లేబుళ్లు, ప్యాకేజింగ్ వస్తువులను ముగించి తదుపరి ముద్రణలో తమ ఆదేశాలను పాటించాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు కేవలం పాల, పాల ఉత్పత్తులను తయారుచేస్తున్న సంస్థలకే కాదు, వాటిని మార్కెట్ చేస్తున్న సంస్థలకు కూడా వర్తిస్తాయని పేర్కొంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బిగ్ బాస్కెట్, స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ విక్రేతలకు కూడా ఆదేశాలు పంపించింది.

మోదీ జోక్యం చేసుకోవాలి – ICAR

ఇదిలా ఉంటే.. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) మాత్రం FSSAI ఆదేశాలను వ్యతిరేకిస్తోంది. ఆ సంస్థ గవర్నింగ్ బాడీ సభ్యుడు వేణుగోపాల్ బదరవాడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. FSSAI జారీ చేసిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని ఆదేశించాల్సిందిగా ప్రధానిని కోరుతూ.. పాల ఉత్పత్తుల్లో A1, A2 రకాలను నిర్థారించేందుకు ఒక హై-లెవెల్ కమిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కమిటీలో కేంద్ర యానిమల్ హస్బెండరీ అండ్ డైరీయింగ్ శాఖ, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలకు చెందిన ప్రతినిధులతోపాటు ICAR సభ్యులు, నిపుణులను కూడా భాగం చేయాలని సూచించారు. దేశీ రకం (A2) పాలు, పాల ఉత్పత్తులతో కలిగే ప్రయోజనాల గురించి తెలిసి కూడా FSSAI ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం తగదని ఆయన అభిప్రాయపడ్డారు. వినియోగదారుడు ఏ రకం పాలను తీసుకోవాలో నిర్ణయించుకునే అవకాశాన్ని ఈ ఆదేశాలు దెబ్బతీస్తున్నాయని అన్నారు.

ఈ లేఖలో దేశంలోని పశు సంపదలో ఉన్న ఏ జాతులు ఎంత శాతం ఉన్నాయో కూడా వివరించారు. దేశంలోని మొత్తం 190.9 మిలియన్ల పశువుల్లో 53 రకాలు దేశీయ జాతులుగా గుర్తించినట్టు పేర్కొన్నారు. మొత్తం పశు సంపదలో దేశీయ జాతుల సంఖ్య 22 శాతం మాత్రమే ఉందని, మరో 26 శాతం క్రాస్ బ్రీడ్ కాగా, మిగతా 52 శాతం ఏ జాతో తేల్చని రకాలు అని అన్నారు. 1998 నుంచి భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక పాలను ఉత్పత్తి చేస్తూ అగ్రస్థానంలో నిలవగా.. ప్రతియేటా ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోంది. 2016 డిసెంబర్ 10న ప్రధాని మోదీ “అమూల్ దేశీ A2 ఆవు పాలు” గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారని, కాంక్రేజ్ జాతి దేశీ ఆవు నుంచి ఈ పాలను సేకరిస్తారని గుర్తుచేశారు. ఆ సమయంలో ప్రధాని మోదీ దేశీయ గిర్ జాతి, కాంక్రేజ్ జాతుల పశు సంపద, వాటి ఉత్పత్తుల్లో పోషకాల గురించి వివరించారని అన్నారు. ఈ పరిస్థితుల్లో వినియోగదారులకు A2 పాలు, పాల ఉత్పత్తులను ఎంచుకుని కొనుక్కునే అవకాశం కల్పించాలని వేణుగోపాల్ ప్రధానిని కోరారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి