AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రయాణికుడి బంగారు బ్రేస్‌లెట్ మాయం.. ఇండిగోపై రూ.60 వేల పరిహారం

ప్రయాణికుడి బంగారు బ్రేస్‌లెట్ మాయమైన కేసులో ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్-I ₹60,000 పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అబుదాబి నుండి హైదరాబాద్‌కు వస్తున్న ప్రయాణికుడి క్యాబిన్ బ్యాగ్ నుండి 24 క్యారెట్ల బంగారు బ్రేస్‌లెట్ కనిపించకుండా పోయింది. సామానును భద్రంగా కాపాడటంలో, ఫిర్యాదుపై సకాలంలో స్పందించడంలో ఇండిగో విఫలమైందని కమిషన్ సేవలో లోపం గుర్తించింది.

ప్రయాణికుడి బంగారు బ్రేస్‌లెట్ మాయం.. ఇండిగోపై రూ.60 వేల పరిహారం
Indigo
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Feb 04, 2026 | 1:29 PM

Share

ప్రయాణికుడి సామానును భద్రంగా కాపాడడంలో విఫలమైనందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్–I తీవ్రంగా స్పందించింది. సేవలో లోపం ఉన్నట్లు తేల్చి, బాధితుడికి రూ.60 వేల పరిహారంb చెల్లించాలని ఆదేశించింది. ఫిర్యాదుపై ఆలస్యంగా స్పందించిన తీరు కూడా తప్పేనని కమిషన్ స్పష్టం చేసింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం గంగన్నపేట గ్రామానికి చెందిన మహ్మద్ రైస్ ఖాన్‌ 2023 డిసెంబర్‌ 6న అబుదాబి నుంచి హైదరాబాద్‌కు ఇండిగో విమానంలో ప్రయాణించాడు. తన క్యాబిన్ బ్యాగ్‌లో 35.47 గ్రాముల బరువున్న 24 క్యారెట్ల బంగారు బ్రేస్‌లెట్‌ను తీసుకొచ్చాడు.

దుబాయ్‌లో కొనుగోలు చేసిన ఆ బ్రేస్‌లెట్‌కు సంబంధించిన చెల్లుబాటు అయ్యే పన్ను బిల్లు కూడా అతని వద్ద ఉంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్) చేరుకున్న తర్వాత, తన క్యాబిన్ బ్యాగ్ తాళం పగిలి ఉండటాన్ని గమనించాడు. బ్యాగ్ తెరిచి చూడగా బంగారు బ్రేస్‌లెట్ మాయమైందని తెలిసింది. వెంటనే ఇండిగో హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించి ప్రాపర్టీ ఇర్రెగ్యులారిటీ రిపోర్ట్ (PIR) నమోదు చేశాడు. అనంతరం శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో, వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ఇవి కూడా చదవండి

కేసును పరిశీలించిన కమిషన్, ప్రయాణికుడి విలువైన వస్తువును భద్రపరచడంలో ఎయిర్‌లైన్ విఫలమైందని పేర్కొంది. ఫిర్యాదుపై స్పందించడంలో జరిగిన ఆలస్యం కూడా సేవలో లోపంగానే పరిగణించాల్సినదని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ బాధితుడికి రూ.60 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.