G20 Summit: సెప్టెంబర్ 8న ప్రధాని మోదీ – బైడెన్ ప్రత్యేక భేటీ.. ఆ కీలక అంశాలపై చర్చలు

|

Sep 02, 2023 | 1:39 PM

సెప్టెంబర్ 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో నిర్వహించనున్న జీ20 సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా పలు ప్రపంచ దేశాల అగ్రనేతలు తరలిరానున్నారు. ఈ సదస్సుకు హాజరు కాలేకపోతున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీకి రెండ్రోజుల క్రితం ఫోన్‌లో తెలియజేసినట్లు తెలుస్తోంది. అలాగే దేశ సరిహద్దుల వివాదం నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా ఈ సదస్సుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

G20 Summit: సెప్టెంబర్ 8న ప్రధాని మోదీ - బైడెన్ ప్రత్యేక భేటీ.. ఆ కీలక అంశాలపై చర్చలు
Indian PM Modi, US president Biden (File Photo)
Follow us on

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ పర్యటన షెడ్యూల్ ఖరారయ్యింది. జీ20 సదస్సులో పాల్గొనేందుకు సెప్టెంబర్ 7న ఆయన న్యూఢిల్లీ రానున్నారు. సెప్టెంబర్ 10 వరకు నాలుగు రోజుల పాటు భారత్‌లో ఆయన అధికారిక పర్యటన కొనసాగనుంది. తనకు ప్రపంచంలో భారత్ అత్యంత ముఖ్యమైన దేశమని ఈ ఏటి జీ20 సదస్సు‌కు భారత్ సారథ్యంవహిస్తుండటం తెలిసిందే. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో నిర్వహించనున్న ఈ సదస్సుకు పలు ప్రపంచ దేశాల అగ్రనేతలు తరలిరానున్నారు. ఈ సదస్సుకు హాజరు కాలేకపోతున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీకి రెండ్రోజుల క్రితం ఫోన్‌లో తెలియజేసినట్లు తెలుస్తోంది. అలాగే దేశ సరిహద్దుల వివాదం నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా ఈ సదస్సుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

జీ20 సదస్సులో పాల్గొనేందుకు సెప్టెంబర్ 7న జో బైడెన్ న్యూఢిల్లీ వస్తున్నారు. మరుసటి రోజు.. అంటే సెప్టెంబర్ 8న ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ఉక్రెయిన్-రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలపై ఏర్పడుతున్న ఆర్థిక, సాంఘిక ప్రభావాన్ని తగ్గించడంపై ఈ భేటీలో వారు చర్చిస్తారని పేర్కొంది. అలాగే ఇతర అంతర్జాతీయ సవాళ్లు, పేదరికంపై పోరాటం, వాతావరణ మార్పులు తదితర అంశాలపై వారు చర్చించనున్నారు.

చైనా దుందుడుకు చర్యలు..

ఇవి కూడా చదవండి

చైనా దుందుడుకు చర్యల కారణంగా ఆసియాలో నెలకొంటున్న ఉద్రిక్త పరిస్థితులపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. కీలకమైన అంతర్జాతీయ అంశాల విషయంలో ప్రధాని మోదీ చూపుతున్న చొరవను బైడెన్ ప్రత్యేకంగా అభినందించే అవకాశముంది. 2026లో జీ20 సదస్సుకు అమెరికా అతిథ్యం ఇవ్వనుందని అమెరికా అధికార వర్గాలు గుర్తుచేశాయి.

ఇతర దేశాల అగ్రనేతలతోనూ బైడెన్ విడిగా భేటీ..

జీ20 సదస్సు మధ్యలో పలు ఇతర దేశాల అగ్రనేతలతోనూ బైడెన్ విడివిడిగా భేటీకానున్నారు. ఆయా దేశాలతో అమెరికా దౌత్య సంబంధాలతో పాటు అంతర్జాతీయ అంశాలపై ఆయన చర్చించనున్నట్లు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి.

జీ20 సభ్య దేశాలు ఇవే..

ప్రపంచంలో అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న వర్తమాన దేశాలు జీ20 దేశాల సమాఖ్యలో సభ్య దేశాలుగా ఉన్నాయి. సభ్య దేశాలు రొటేషన్ పద్ధతిలో ఒక్కో సంవత్సరం జీ20 సదస్సుకు ఆతిథ్యమిస్తున్నాయి. జీ20లో సభ్యత్వమున్న దేశాల్లో భారత్, అమెరికా, చైనా, రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రెజిల్, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, ది రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, సౌది అరేబియా, దక్షిణాఫ్రికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్, తుర్కియే దేశాలు ఉన్నాయి.

ఢిల్లీలో జరిగే జీ20 సదస్సుకు బంగ్లాదేశ్‌తో పాటు ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, సింగపూర్, స్పెయిన్, యూఏఈ దేశాలు అతిథులుగా హాజరుకానున్నాయి. జీ20 సదస్సు నేపథ్యంలో దేశ రాజధానిలో కనీవినీ ఎరుగని భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..