మాటలకందని విషాదం.. సంచార జీవుల ప్రాణం తీసిన వృక్షం.. పాపం నిద్రలోనే నలుగురు..

|

May 25, 2023 | 11:38 AM

జమ్మూకశ్మీర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కిష్త్వార్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో ఓ భారీ వృక్షం కూలి నలుగురు మృతిచెందారు. మృతులు.. మేకలు, గొర్రెలు కాస్తూ జీవనం కొనసాగించేవారని అధికారులు తెలిపారు.

మాటలకందని విషాదం.. సంచార జీవుల ప్రాణం తీసిన వృక్షం.. పాపం నిద్రలోనే నలుగురు..
Goats
Follow us on

జమ్మూకశ్మీర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కిష్త్వార్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో ఓ భారీ వృక్షం కూలి నలుగురు మృతిచెందారు. మృతులు.. మేకలు, గొర్రెలు కాస్తూ జీవనం కొనసాగించేవారని అధికారులు తెలిపారు. కిష్త్వార్ జిల్లాలోని కేష్వాన్ బెల్ట్‌ లోని భల్నా అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఓ భారీ పైన్ చెట్టు.. డేరాపై పడిపోవడంతో గిరిజన సంచార కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందినట్లు కిష్త్వార్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఖలీల్ పోస్వాల్ PTIకి తెలిపారు. భారీ వర్షాలు, గాలుల కారణంగా పైన్ వృక్షం నేలకూలిందన్నారు.

మృతులు కథువా జిల్లాలోని గతి-బర్వాల్ వాసులని అధికారులు వివరించారు. మృతుల్లో నజీర్ అహ్మద్, అన్వర్ బేగం, షమా బేగం, షకీల్ బనో ఉన్నారు. నజీర్ అహ్మద్ కుటుంబం గొర్రెలను బహన్లా అడవుల్లో మేపుకుంటూ.. దాచన్ వైపు వెళుతున్నారు. ఈ క్రమంలో భల్నా అడవిలో చెట్టుకింద డేరాలు ఏర్పాటు చేసుకుని రాత్రి బస చేశారు.

భారీ వర్షాలు, గాలుల కారణంగా చెట్టు కూలిపోయిందని.. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా నలుగురు అక్కడికక్కడే మరణించారని కిష్త్వార్ డిప్యూటీ కమిషనర్ దేవాన్ష్ యాదవ్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసు బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించిందని యాదవ్ పేర్కొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తున్నామని వివరించారు.

ఇవి కూడా చదవండి

బాధిత కుటుంబానికి సహాయంగా రెడ్‌క్రాస్ సొసైటీ నుంచి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.50 వేలు అందించినట్లు డిప్యూటీ కమిషనర్ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..