
మహిళల భద్రతకు సంబంధించిన షాకింగ్ ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో వెలుగు చూసింది. ఒక ప్రముఖ సంస్థ తమ మహిళా ఉద్యోగుల కోసం నిర్వహిస్తున్న హాస్టల్ టాయిలెట్లో రహస్యంగా స్పై కెమెరాలు అమర్చినట్లు గుర్తించడంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ హాస్టల్లో ఉంటున్న ఒడిశాకు చెందిన ఒక మహిళా ఉద్యోగినియే ఈ కెమెరాలను అమర్చింది. ఈ నిందితురాలు రహస్యంగా వీడియోలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.
అదే హాస్టల్లో నివసిస్తున్న మరో మహిళకు ఆమె కదలికలపై అనుమానం రావడంతో వెంటనే ఆ విషయాన్ని హాస్టల్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లింది. నిర్వాహకులు చెక్ చేయగా.. టాయిలెట్ లోపల కెమెరాలు దాచి ఉంచిన గుట్టు బయటపడింది. ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి నిందితురాలిని అరెస్టు చేశారు. రికార్డు చేసిన ఫుటేజీని నిందితురాలు తన ప్రియుడికి పంపాలని ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే , ఈ వీడియోలు షేర్ చేయబడకముందే ఆమె పట్టుబడింది.
ఈ విషయం తెలుసుకున్న హాస్టల్లో ఉంటున్న పొందుతున్న సుమారు 2 వేల మంది మహిళా ఉద్యోగులు ఆందోళనకు దిగారు. నిందితురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని, హాస్టల్లో భద్రతా ప్రమాణాలను పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సదరు ప్రైవేటు సంస్థ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితురాలు ఇంకా ఏమైనా ఫుటేజీలు రికార్డు చేసిందా..? ఈ నేరంలో ఇంకెవరి ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..