మహారాష్ట్రలో ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌తో బీజేపీ గెలిచిందన్న రాహుల్.. ఘాటుగా స్పందించిన ఈసీ

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు ఎన్నికల కమిషన్ వివరణాత్మక సమాధానం ఇచ్చింది. ఓటింగ్ ప్రక్రియ పారదర్శకత, ఓటర్ల జాబితా ఖచ్చితత్వాన్ని కమిషన్ వివరించింది. కాంగ్రెస్ వాదనలను వాస్తవ డేటాతో కమిషన్ తోసిపుచ్చింది. అన్ని ప్రక్రియలు నిర్దేశించిన నిబంధనల ప్రకారం జరిగాయని పేర్కొంది.

మహారాష్ట్రలో ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌తో బీజేపీ గెలిచిందన్న రాహుల్.. ఘాటుగా స్పందించిన ఈసీ
Election Commission on Rahul Gandhi

Updated on: Jun 07, 2025 | 5:41 PM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌తో గెలిచిందని , బిహార్‌లో కూడా ఇలాగే గెలిచేందుకు కుట్ర చేస్తోందని రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలపై రాజకీయ రచ్చ మరింత ముదిరింది. ప్రజాస్వామ్య రిగ్గింగ్‌కు 2024 మహారాష్ట్ర ఎన్నికలు ఉదాహరణ అని అన్నారు రాహుల్‌. ఎన్నికల కమిషన్‌ నియామకం, నకిలీ ఓటర్ల నమోదు, పోలింగ్‌లో అవకతవకలు, ఆధారాలను దాచిపెట్టడంతో బీజేపీ గెలిచిందని రాహుల్‌ ఆరోపించారు. ఇలా మోసం చేసి గెలవడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు. ప్రజలంతా ఆధారాలను గమనించి సమాధానాల కోసం డిమాండ్ చేయాలన్నారు. ఒకటోదశలో ఎన్నికల సంఘం సభ్యుల నియామకానికి సంబంధించిన ప్యానెల్‌లో రిగ్గింగ్‌ చేస్తారని అన్నారు. రెండోదశలో ఓటర్ల జాబితాలో బోగస్‌ ఓట్లను చేరుస్తారన్నారు. మూడోదశలో ఓటర్‌ శాతంలో మార్పులు తెస్తారని రాహుల్‌ అన్నారు. ఇక నాలుగోదశలో బీజేపీ విజయానికి అవసరమైనచోట బోగస్‌ ఓట్లపై దృష్టిపెడతారన్నారు. చివరిగా ఐదోదశలో ఆధారాలు దాచిపెడతారని రాహుల్‌ తన సోషల్‌ మీడియా పోస్ట్‌లో ఆరోపించారు.

రాహుల్‌గాంధీ ఆరోపణలను ఈసీ తీవ్రంగా ఖండించింది. నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈసీ అధికారుల మనో ధైరాన్ని దెబ్బతీసే రీతిలో మాట్లాడడం తగదని ఈసీ వివరణ ఇచ్చింది. మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి అన్ని వివరాలు ఈసీ వెబ్‌సైట్‌లో ఉన్నట్టు వెల్లడించింది. ఆరోపణలపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చినప్పటికి మళ్లీ అవే ఆరోపణలు చేయడం తగదని ఈసీ వ్యాఖ్యానించింది.

పదేపదే అబద్దాలు చెప్పడం రాహుల్‌కు అలవాటు అని విమర్శించారు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా. రాహుల్‌గాంధీ తీరు తోనే కాంగ్రెస్‌ వరుసగా ఓటమి పాలవువతోందని విమర్శించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అని ట్వీట్‌ చేశారు నడ్డా. ప్రజాస్వామ్యంలో నాటకాలను కాదు.. వాస్తవాలనే ప్రజలు నమ్ముతారని జేపీ నడ్డా అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..