Fake CBI Officers: రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. ఏకంగా సీబీఐ పేరిట ఫోన్ కాల్స్! వైద్యుడి ఖాతాలో రూ.4 కోట్లు హుష్‌

సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకీ పెచ్చుమీరుతున్నాయి. ఈ సారి ఏకంగా సీబీఐ అధికారుల అవతారం ఎత్తారు. ఓ వైద్యుడికి ఫోన్‌ చేసి తాము సీబీఐ అధికారులం అంటూ బెదిరించి, ఏకంగా రూ.3.71 కోట్లు కాజేశారు. ఆనక అసలు విషయం తెలుసుకుని వైద్యుడు లబోదిబోమంటూ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు..

Fake CBI Officers: రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. ఏకంగా సీబీఐ పేరిట ఫోన్ కాల్స్! వైద్యుడి ఖాతాలో రూ.4 కోట్లు హుష్‌
Fake CBI Officers

Updated on: May 23, 2024 | 11:52 AM

బెంగళూరు, మే 23: సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకీ పెచ్చుమీరుతున్నాయి. ఈ సారి ఏకంగా సీబీఐ అధికారుల అవతారం ఎత్తారు. ఓ వైద్యుడికి ఫోన్‌ చేసి తాము సీబీఐ అధికారులం అంటూ బెదిరించి, ఏకంగా రూ.3.71 కోట్లు కాజేశారు. ఆనక అసలు విషయం తెలుసుకుని వైద్యుడు లబోదిబోమంటూ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. ఈ షాకింగ్‌ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కర్ణాటకలోని హావేరీకి చెందిన భీమ్‌సేన్ శ్రేణివాస్ కర్జగి (83) అనే ఓ సీనియర్‌ డాక్టర్‌కు ముంబై నుంచి సీబీఐ నుంచి కాల్ వచ్చింది. ఫోన్‌లోని గొంతు తాను సీబీఐ అధికారి దీక్షిత్‌ గిడమ్‌నని తనను తాను పరిచయం చేసుకున్నాడు. నరేష్ గోయల్ అనే వ్యక్తి తన పేరు మీద నకిలీ పత్రాలతో బ్యాంకు ఖాతాలు తెరిచి, అక్రమ లావాదేవీలకు జరిపినట్లు తెలిపాడు. మనీలాండరింగ్‌తో సహా పలు నేర కార్యకలాపాలకు వీటిని ఉపయోగించినట్లు కాల్ చేసిన వ్యక్తి వైద్యుడికి చెప్పాడు. ఫోన్ చేసిన వ్యక్తి వైద్యుడి ఆధార్ వివరాలను అడిగాడు. అనంతరం అతని ఖాతాలో ఉన్న డబ్బు గురించి ఆరా తీశాడు.

వైద్యుడి ఖాతా నుంచి మొత్తం సొమ్మును సీబీఐ ఖాతాకు పంపకపోతే డాక్టర్‌ ఇంటికి వచ్చి అతన్ని అరెస్ట్‌ చేసి తీసుకుపోతామని బెదిరించారు. 10 వేర్వేరు బ్యాంకు ఖాతాలకు డబ్బును బదిలీ చేయాలని వైద్యుడిని కోరాడు. దీంతో హడలెత్తిపోయిన వైద్యుడు తాను ఏ నేరం చేయకపోయినా.. అరెస్టు భయంతో ఏప్రిల్ 11 నుంచి 17 వరకు వివిధ దఫాల్లో 3 కోట్ల 71 లక్షల రూపాయలను నకిలీ సీబీఐ అధికారి ఖాతాలకు పంపాడు. వివిధ దఫాల్లో డబ్బు చెల్లించిన తర్వాత బిల్లులు కోరగా ముఖం చాటేశారు. సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పేరుతో మోసగాళ్లు డాక్టర్ నుంచి దాదాపు 4 కోట్ల రూపాయలను దోచుకున్నారు. దీంతో మోసపోయానని తెలిసిన డాక్టర్ మే 18న సైబర్ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై సైబర్ క్రైమ్ బ్రాంచ్ విచారణ ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.