లిఫ్ట్ అడిగారు కదా.. అని అతను కారును ఆపి ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత వారు.. అతని కళ్లలో కారం చల్లి.. కారును ఎత్తుకెళ్లారు. ఈ షాకింగ్ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేపింది. నలుగురు కేటుగాళ్లు బరి తెగించి.. లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి కారునే కొట్టేసిన ఘటన యూపీలోని నోయిడాలో జరిగింది. అతడి కళ్లలో కారం కొట్టి, బలవంతంగా టాటా ఎస్యూవీ కారును ఎత్తుకుపోయారు. ఈ ఘటన నోయిడాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నోయిడాలోని సెక్టార్-93లో ఉండే ఓ వ్యక్తి ఢిల్లీలో పని చేస్తున్నాడు. గత బుధవారం కారులో వెళ్తుండగా మధ్యలో నలుగురు వ్యక్తులు ఆపి లిఫ్ట్ అడిగారు.
తాము కూడా ఢిల్లీకే వస్తున్నామని.. లిఫ్ట్ ఇవ్వాలంటూ కోరారు. ఫ్రీ గా వద్దని.. ఛార్జీలు ఇస్తామని పేర్కొన్నారు. ఛార్జీలు చెల్లిస్తామని చెప్పడంతో ఆ వ్యక్తి కారులోకి ఎక్కించుకున్నాడు. అయితే కొద్ది దూరం వెళ్లేసరికి ఆ నలుగురూ కారు యజమాని కళ్లలో కారం కొట్టారు. అనంతరం కారును గురుగ్రామ్, హరియానా వైపు మళ్లించారు. మధ్యలో కారు యజమానిని బలవంతంగా కిందకు తోసేసి కారును ఎత్తుకుపోయినట్టు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై నోయిడా సెక్టార్ 20 పోలీస్స్టేషన్లో సెప్టెంబరు 23న జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఫేజ్ 2 పోలీస్స్టేషన్ పరిధిలో నిందితులు ఉన్నట్లు గుర్తించి వారిని పట్టుకున్నాం అని సెంట్రల్ నోయిడా అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మీడియాకు తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని.. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు చెప్పారు.
ఇద్దరు నిందితులను ఆదివారం అరెస్టు చేశామని, కారును కూడా స్వాధీనం చేసుకున్నామని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్ నోయిడా) సాద్ మియాన్ ఖాన్ తెలిపారు. రోషన్ మిశ్రా, అనిల్ కుమార్లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..