
హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. పలు పర్యాట ప్రాంతాలు తిరిగివచ్చేలా ప్రత్యేక రూట్లను జీహెచ్ఎంసీ సిద్ధం చేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్ బుధవారం ట్వట్టర్ వేదికగా వెల్లడించారు. అయితే గతంలోనే రూ.12.96 కోట్లతో ఆరు డబుల్ డెక్కర్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను హెచ్ఎండీఏ కొనుగోలు చేసింది.అయితే ఎట్టకేలకు ఈ బస్సులు తిరిగేలా కొన్ని రూట్లను ఎంపిక చేశారు. ముఖ్యంగా ట్యాంక్బండ్, బిర్లామందిర్, అసెంబ్లీ, సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, మక్కా మసీద్తోపాటు తారామతి బారాదరి, గోల్కొండ, గండిపేట పార్కు, దుర్గం చెరువు, తీగల వంతెన, ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ జిల్లా ప్రాంతాల్లో నడపనున్నారు.
ఉదయం ట్యాంక్ బండ్ వద్ద బయలు దేరి ఆయా రూట్లల్లో తిరుగుతూ మళ్లీ తిరిగి ట్యాంక్ బండ్ కు చేరుకుంటాయి. అయితే ఛార్జింగ్ కోసం ఖైరతాబాద్ ఎస్టీపీ, సంజీవయ్య పార్కులో ప్రత్యేక పాయింట్లను కూడా ఏర్పాటు చేశారు. కొన్నిరోజుల పాటు ఈ బస్సులో ఉచిత ప్రయాణమే ఉండనుంది. ఆ తర్వాత కనీస ఛార్జి విధించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఒక్కో ట్రిప్పుకు ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.50 చొప్పున వసూలు చేసే అవకాశం ఉంది. ఎప్పటి నుంచి టిక్కెట్ అందుబాటులోకి తీసుకురావాలని అన్న విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగే పర్యాటకులు స్పందనను బట్టి మరికొన్ని రూట్లను కూడా ఎంపిక చేయనున్నారు. అయితే గతంలోనే మంత్రి కేటీఆర్.. అదనంగా మరో 30 వరకు ఏసీ డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..